యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. ఆయిల్, గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్న ఆయా దేశాల చూపు ఇప్పుడు హర్మూజ్ జల సంధిపై పడింది. యుద్ధం ప్రారంభం అయిన తర్వాత ఈ జల సంధి దగ్గర 800 నౌకలు చిక్కుకుపోయాయి. ఈ 800 షిప్పుల్లో 20 వేల మంది సిబ్బంది ఉన్నారు. యుద్ధానికి బ్రేక్ పడటంతో.. ఇక ఈ 800 నౌకలు ఎప్పుడు బయలుదేరతాయి అన్న ఆసక్తి ఆయా దేశాల్లో నెలకొంది. ఇప్పటి వరకు అంటే.. 2026, ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 11 గంటలకు ఆయా నౌకలకు ఇరాన్ దేశం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. విధివిధానాలు ఖరారు కాలేదని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ఈ 800 నౌకల్లో 426 నౌకల్లో క్రూడ్ ఆయిల్ ఉంది. మరో 34 నౌకల్లో గ్యాస్ ఉంది. మరో 19 నౌకల్లో లిక్విడ్ గ్యాస్ ఉంది. మిగతా నౌకలు ఐరన్, ఆహారం, ఇతర వస్తువులను ఆయా దేశాలకు తరలిస్తూ.. ఈ జల సంధి దగ్గర చిక్కుకుపోయాయని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
ఈ నౌకలన్నీ హర్మూజ్ జల సంధి దాటటానికి నాలుగు, ఐదు రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. యుద్ధం ప్రారంభం కాకముందు ఈ మార్గం నుంచి రోజుకు 135 నుంచి 140 నౌకలు రాకపోకలు సాగించేవి. ప్రస్తుతం ఈ జల సంధికి అటూ ఇటూ 800 నౌకలు ఉన్నాయని.. ఇవన్నీ క్లియర్ కావటానికి 4 నుంచి 5 రోజుల సమయం పడుతుందని.. ప్రపంచ దేశాలు ఓపిగ్గా ఉండాలని.. నౌకలు బయలుదేరటానికి ఇంకా సమయం పట్టొచ్చని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
కాల్పుల విరమణ ఒప్పందం విధివిధానాలు స్పష్టంగా వెల్లడికాలేదని.. జల సంధి దాటటానికి ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తుందా లేదా అనేది తెలియదని.. ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయా దేశాలు స్పష్టం చేస్తున్నాయి.
జపాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా దేశాలకు చెందిన ఆయిల్ నౌకలు చాలా ఉన్నాయి. వీటి రాక కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నాయి. నౌకలు ఎప్పుడు బయలుదేరతాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
