- 85 మందిని బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు
- పోస్టింగ్ ఇవ్వకుండా ఏఆర్కు అటాచ్
- కొత్తగా 82 మంది నియామకం
- వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు, షకీల్ కొడుకు కేసులో ప్రమేయంతో నిర్ణయం
- త్వరలోనే మరికొన్ని పోలీస్ స్టేషన్ల ప్రక్షాళన
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న సిబ్బంది అందరినీ బదిలీ చేశారు. మొత్తం 85 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్లందరికీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆర్డ్మ్ రిజర్వ్ (ఏఆర్)కు అటాచ్ చేశారు. వీరిలో ఆరుగురు ఎస్సైలు, 8 మంది ఏఎస్సైలు, 17 మంది హెడ్ కానిస్టేబుల్స్, 54 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. వీరితో పాటు హోంగార్డ్స్ ను కూడా బదిలీ చేశారు. కాగా, పంజాగుట్ట స్టేషన్ లో కొత్తగా 82 మందిని నియమించారు. వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందిని ఇక్కడికి బదిలీ చేశారు. దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా పేరొందిన పంజాగుట్ట పీఎస్లోని సిబ్బంది అందరినీ ఒకేసారి బదిలీ చేయడం డిపార్ట్మెంట్లో చర్చనీయాంశంగా మారింది.
షకీల్ కొడుకు కేసుతో..
పంజాగుట్ట పీఎస్ పరిధిలోనే ప్రజాభవన్ ఉంది. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రజావాణిలో ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల సమాచారం ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేతలకు చేరుతున్నట్టు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఇందులో పంజాగుట్ట పీఎస్ సిబ్బంది పాత్ర ఉన్నట్టు గుర్తించారు. అలాగే ప్రజాభవన్ వద్ద జరిగిన కారు యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రహెల్ను పథకం ప్రకారమే తప్పించారని ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఇందుకోసం రూ.లక్షలు చేతులు మారినట్టు బయటపడింది. ఈ క్రమంలోనే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై సీపీ యాక్షన్ తీసుకున్నారు. పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం దుర్గారావు పరారీలో ఉన్నారు.
ఎలాంటి కేసు అయినా సెటిల్ మెంట్..
కారు యాక్సిడెంట్ కేసులో షకీల్ కొడుకును సిబ్బంది తప్పించగా.. ఆ తర్వాత కొద్ది రోజులకే పోలీస్ కస్టడీలో ఉన్న కార్ల దొంగ ఎస్కేప్ అయ్యాడు. కార్లు దొంగింలించే అమీర్ ఖాన్ గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ పారిపోయాడు. ఈ రెండు ఘటనలతో పాటు స్టేషన్కు వచ్చే బాధితులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉన్నతాధికారులు గుర్తించారు. మరోవైపు అడ్మిన్ ఎస్సై సహా సెక్టార్ ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇదే స్టేషన్ లో చాలా కాలంగా పనిచేస్తున్న సిబ్బందికి స్థానిక నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఎలాంటి కేసునైనా సరే సెటిల్మెంట్ చేసే విధంగా వ్యవహరిస్తారని ఇప్పటికే ఫిర్యాదులు అందాయి.
మరికొన్ని స్టేషన్లపైనా ఫోకస్..
పోలీస్ స్టేషన్లలో తిష్టవేసిన సిబ్బందిపై సీపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఏండ్ల తరబడి ఒకే పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. గతంలో స్థానిక రాజకీయ పెద్దల సిఫార్సులతో తమకు కావాల్సిన చోట పోస్టింగ్స్ పొందిన కానిస్టేబుల్స్ను గుర్తిస్తున్నారు. అలా కానిస్టేబుల్గా జాయిన్ అయి ఏండ్ల తరబడి అక్కడే పని చేస్తూ హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్సైలు అయినోళ్ల డేటాను సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి వారికి స్థానిక లీడర్లు, నేరస్తులు, వ్యాపారులతో పరిచయాలు ఉంటాయి. దీంతో ఆయా ప్రాంతాలపై తమకు ఉన్న అవగాహనతో అవినీతి అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. పంజాగుట్ట తరహాలోనే మరికొన్ని పోలీస్ స్టేషన్లలోనూ ప్రక్షాళన జరుగనుంది. ప్రధానంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్నగర్ పై సీపీ దృష్టిపెట్టినట్టు తెలిసింది.