లారీ ఢీకొని నిండు గర్భిణి మృతి: కడుపులో శిశువు..

లారీ ఢీకొని నిండు గర్భిణి మృతి: కడుపులో శిశువు..

మరికొన్ని రోజుల్లో ఆ ఇంట్లోకి ఓ బుల్లి వారసుడు రాబోతున్నాడు. బిడ్డకు జన్మనివ్వబోతున్నానని నెలలు నిండిన ఆ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకొని.. ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆ గర్భిణీని పొట్టన పెట్టుకుంది. కూతవేటు దూరంలో ఇంటికి చేరుకుంటామనగా ఆ నిండు చూలాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కడుపులో ఉన్న ఆ శిశువు కన్ను తెరవకుండానే కన్ను మూశాడు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఈ దారుణం జరిగింది. రామచంద్ర బంజర గ్రామ శివార్లలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 9 నెలల నిండు గర్భిణీ బలుసుపాటి కళ్యాణి(20) అక్కడికక్కడే మృతి చెందగా.. కడుపులోని శిశువు పది మీటర్ల దూరంలో పడి మరణించాడు.  మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి చెకప్ చేయించుకొని భర్తతో కలసి బైక్ పై తిరిగి వస్తుండగా ఖమ్మం నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ(AP31 TW 4689) బైక్‌ను వెనకనుండి ఢీకొట్టింది. ఒక్కసారిగా లారీ వారిని ఢీకొట్టడంతో కళ్యాణి ఎగిరి పడింది. దీంతో ఆమె కడుపులోని శిశువు అక్కడి పది మీటర్ల దూరంలో రోడ్డుపై పడి మరణించాడు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆ లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.