- రాష్ట్రంలో 9 నదులు కలుషితం
- సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వెల్లడి
- తెలంగాణలో 19 శాతం నీటి వనరులు నిరుపయోగంగా ఉన్నయ్
- దేశంలో 603 నదుల్లో నాణ్యతను పరిశీలించగా 279 నదుల్లో భారీ కాలుష్యం నమోదు
హైదరాబాద్, వెలుగు రాష్ట్రంలో గోదావరి, కృష్ణ సహా 9 నదులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. నదుల్లో నీటి నాణ్యతను 42 చోట్ల పరిశీలించగా, అందులో 37 చోట్ల విపరీతమైన కాలుష్యంతో కూడిన నీళ్లు ఉన్నాయని స్టేట్స్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ 2023 రిపోర్ట్ వెల్లడించింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే ప్రైవేటు సంస్థ ఈ రిపోర్ట్ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. గ్రీన్ కవర్ ఇంప్రూవ్మెంట్, మున్సిపల్ వేస్ట్ మేనెజ్మెంట్లో మంచి పనితీరు కనబర్చి ఓవరాల్ ర్యాంకింగ్స్లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. నదుల కాలుష్యం, గ్రౌండ్ వాటర్ అధికంగా తోడడం, నీటి వనరులను నిరుపయోగంగా ఉంచడం వంటి అంశాల్లో తెలంగాణ పనితీరు బాగోలేదని రిపోర్ట్లో పేర్కొంది.
రాష్ట్రంలో 19 శాతం వాటర్ బాడీస్ (చెరువులు, కుంటలు వంటివి) నిరుపయోగంగా మారాయని తెలిపారు. కృష్ణ, మూసీ, కరకవాగు, కిన్నెరసాని, మానేరు, మంజీర, మున్నేరు, నక్కవాగు, గోదావరి నదులు కాలుష్యం బారిన పడ్డాయని చెప్పింది. నదుల సంరక్షణలో గతంలో కంటే ప్రస్తుతం తెలంగాణ వెనుకబడిందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 603 నదుల్లో నీటి నాణ్యతను పరిశీలించగా, 279 నదుల్లోని నీళ్లు కనీసం స్నానానికి కూడా పనికిరాకుండా ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు. దేశంలో వాతావరణ కాలుష్యం వల్ల మానవుల జీవితకాలం తగ్గుతోందని రిపోర్ట్లో పేర్కొన్నారు.
గాలి కాలుష్యం వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి ఆయుష్షు 5 ఏండ్ల 2 నెలలు తగ్గగా, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి ఆయుష్షు 4 ఏండ్ల 5 నెలలు తగ్గిందని అంచనా వేశారు. తెలంగాణ రూరల్లో రెండేండ్ల 9 నెలలు, అర్బన్లో మూడేండ్ల మేర ప్రజల జీవిత కాలం తగ్గిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తి, పబ్లిక్ హెల్త్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తెలంగాణ వరుసగా 19, 13, 4వ స్థానాల్లో నిలవడం గమనార్హం.