మద్యం షాపులకు 45 వేల దరఖాస్తులు
చివరిరోజు 24 వేల అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు : మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తులు సర్కార్ కు మస్తు ఆదాయం తెచ్చిపెట్టాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఇన్కమ్ వచ్చింది. 2017లో వచ్చిన రూ.411 కోట్ల ఆదాయాన్ని ఈసారి క్రాస్ చేసింది. ఏకంగా డబుల్ ఆదాయం వచ్చింది. రాష్ర్టంలో 2,216 దుకాణాలు ఉండగా మొత్తం 45,385 దరఖాస్తులతో రూ.907.70 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. బుధవారం ఒక్క రోజే 24,448 అప్లికేషన్ల వచ్చాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ తెలిపారు. అత్యధికంగా వరంగల్ డివిజన్లో 261 దుకాణాలకు 7,864 అప్లికేషన్లతో రూ.157.28 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక హైదరాబాద్ డివిజన్లో 173 దుకాణాలకు 1,462 దరఖాస్తులే వచ్చాయి. ఇక్కడ రూ.29.24 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక జిల్లాల వారీగా చూస్తే ఖమ్మంలో 4282 అప్లికేషన్లకు రూ.85.64 కోట్లు, నల్లగొండలో 3031 దరఖాస్తులకు 60.62 కోట్లు, కొత్త గూడెంలో 2989 దరఖాస్తులకు 59.78 కోట్లు, సూర్యాపేటలో 2384 దరఖాస్తులకు 47.68 కోట్ల ఆదాయం వచ్చింది.
ఏపీ ఎఫెక్ట్..
ఏపీలో మద్యం నియంత్రణ ఎఫెక్ట్ తెలంగాణ కలిసొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అక్కడున్న మద్యం వ్యాపారులు ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో ఎక్కువగా దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. గత పాలసీలో నాన్ రీఫండబుల్ దరఖాస్తు ఫీజు లక్ష ఉండగా, ఈ సారి ప్రభుత్వం రెండు లక్షలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫీజు డబ్బులు మొత్తం ప్రభుత్వ ఖజానాలోకే వెళ్తాయి. బుధవారం ఆఖరి గడువు కావడంతో పెద్ద సంఖ్యంలో దరఖాస్తులు వచ్చాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు వచ్చిన వారినే దరఖాస్తుకు లోపలికి అనుమతించారు. నాలుగు గంటల వరకు వచ్చిన వారు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో కొన్ని జిల్లాల్లో రాత్రి 11గంటల దాకా అప్లికేషన్లు స్వీకరించారు. ఇక దరఖాస్తు చేసుకున్న వారిలో అనేక మంది కొత్తవారితోపాటు పెద్దసంఖ్యలో మహిళలు ఉండటం గమనార్హం. 18వ తేదీన డ్రా తీయనున్నారు.