- బగ్ కనుగొన్నడు.. రూ.22 లక్షలు అందుకున్నడు
- ఇన్స్టాగ్రామ్లో బగ్ను గుర్తించిన మహారాష్ట్ర యువకుడు
- దాన్ని సరి చేసుకొని ప్రైజ్ మనీ ఇచ్చిన ఫేస్బుక్
న్యూఢిల్లీ: ఇన్స్టాగ్రామ్ యాప్లో హానికరమైన బగ్ను కనుగొన్న 21 ఏళ్ల యువకుడికి ఫేస్బుక్ రూ. 22 లక్షలు అందించింది. ఇన్స్టాగ్రామ్లో యూజర్లను ఫాలో అవకుండానే వాళ్ల పోస్టులు, స్టోరీలు, రీల్స్ ఇలా అన్నీ చూసేలా వీలు కల్పించే బగ్ను యువకుడు గుర్తించినందుకు ఆ సోషల్ మీడియా సంస్థ అభినందించింది. ప్రస్తుతానికి ఆ బగ్ సమస్యను ఫేస్బుక్ పరిష్కరించింది. ఒకవేళ దాన్ని అలాగే వదిలేస్తే యూజర్లను ఫాలో కాకుండానే వాళ్ల ఫొటోలు, వీడియోలను హ్యాకర్లు అక్రమంగా చూసేందుకు అవకాశముండేదని చెప్పింది.
ఏప్రిల్లో కనుగొన్నడు
మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన యువకుడు మయూర్ ఫర్తడే కంప్యూటర్ సైన్స్లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. సీ ప్లస్ ప్లస్, పైథాన్ నేర్చుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో ఇన్స్టాగ్రామ్లో లోపాన్ని కనుగొన్నాడు. దాని ద్వారా హ్యాకర్లు అవతలి వ్యక్తుల పోస్టులను ఎలా చూడగలరో వివరించాడు. ఆ బగ్ ద్వారా ప్రైవేట్ ఇన్స్టా ఖాతాల ఫొటోలు, ఆర్కైవ్డ్ పోస్టులు, స్టోరీలు, రీల్స్ ఈజీగా పొందొచ్చని చెప్పాడు. పోస్టుకు సంబంధించిన మీడియా ఐడీ ద్వారా ఈ వివరాలను పొందొచ్చన్నాడు. ఆ బగ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ తో పాటు దానికి కనెక్టయి ఉన్న ఫేస్బుక్ పేజీల సమాచారమూ తెలుసుకోవచ్చని వివరించాడు. ఈ లోపం గురించి ఏప్రిల్ 16న ఫేస్బుక్కు వివరించాడు. ఏప్రిల్ 19న ఆ సంస్థ నుంచి బదులొచ్చింది. ప్రమాదకరమైన లోపాన్ని కనుగొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్లోనూ ఇలాంటి లోపాలుంటే పంపించాలని కోరింది. జూన్ 15న రూ. 22 లక్షలను మయూర్కు అందజేసింది. బగ్ బౌంటీని పార్ట్ టైమ్ ఉద్యోగంగా కొనసాగిస్తానని, సాఫ్ట్వేర్ డెవలపర్ కావడమే తన లక్ష్యమని మయూర్ తెలిపాడు.