అపార్ట్మెంట్ కూల్చేస్తామంటూ.. గచ్చిబౌలిలో హైడ్రా పేరుతో బెదిరింపులు

అపార్ట్మెంట్ కూల్చేస్తామంటూ.. గచ్చిబౌలిలో హైడ్రా పేరుతో బెదిరింపులు

హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న  ఇద్దరిపై  గచ్చిబౌలి పీఎస్ లో కేసు న‌మోదయ్యింది.  అల్కాపురి టౌన్ షిప్ లో నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ దగ్గరకు  వెళ్ళి.. అక్రమంగా నిర్మిస్తున్న ఈ అపార్ట్ మెంట్  ను కూల్చేస్తామని బెదిరించారు  మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభ‌న్ బాబు.  నిందితులు మిరియాల వేదాంతం కారు డ్రైవ‌ర్ కాగా మరో నిందితుడు యెలిసెట్టి శోభ‌న్‌ బాబు ఆర్టీసీలో ప‌ని చేసి రిటైర్ అయినట్లు పోలీసుల గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు  ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు  పోలీసులు. 

ALSO READ | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇక నుంచి టిఫిన్ కూడా..

హైడ్రా పేరు చెప్పి ఎవ‌రైనా మోసాల‌కు పాల్పడితే . 8712406899 నంబ‌రుకు ఫోను చేసి స‌మాచారాన్ని అందజేయాలని హైడ్రా విజ్ఞప్తి చేసింది. నేరుగా గానీ  వాట్సప్‌‌ ద్వారా గానీ సమాచారం ఇవ్వాలని  సూచించింది. ఇలా బెదిరించే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

హైదరాబాద్ పరిధిలో గత కొన్ని నెలలుగా  హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న సంగతి తెలిసిందే.  దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు నిర్మాణ సంస్థలను బెదిరిస్తున్నారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో లేదంటే వాటి పరిసరాల్లో బిల్డింగ్​లు నిర్మిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. నిర్మాణాలు అక్రమమంటూ హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.వాళ్లతో దిగిన ఫొటోలు చూపిస్తూ సమస్య పరిష్కరిస్తామని నమ్మబలికి  భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. హైదరాబాద్ లో  ఈ దందా అక్కడక్కడ కొన్ని రోజులుగా నడుస్తోంది.

హైడ్రా పేరుతో ఎవరైనా బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే వారిని జైలుకు పంపుతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇప్పటికే  హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను కొందరు బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలున్నాయంటూ బుకాయిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని అన్నారు. అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని  ఆయన హెచ్చరించారు.