- మద్యం మత్తులో వెహికల్ నడిపి పాదచారులను, బైక్లను ఢీకొట్టిన టాటా ఏస్ డ్రైవర్
- మహిళ మృతి.. మరో నలుగురికి గాయాలు
జీడిమెట్ల, వెలుగు: మద్యం మత్తులో వెహికల్ నడిపిన ఓ డ్రైవర్ రెండు బైక్ లను, పాదచారులను ఢీకొట్టాడు. ప్రమాదంలో మహిళ చనిపోగా.. నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొట్టు రాజు అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగిన బొట్టు రాజు టాటా ఏస్ వెహికల్ ను నడుపుతూ కుత్బుల్లాపూర్ గ్రామం వద్ద ముగ్గురు పాదచారులను, రెండు బైక్లను ఢీకొట్టాడు.
ప్రమాదంలో చింతల్లోని అంబేద్కర్ నగర్కు చెందిన సంతోషి(35) తీవ్రంగా గాయపడి మృతి చెందింది. మరో నలుగురు సరిత, సర్దార్ అలీ, మహ్మద్, నర్సింగ్కు గాయాలు కాగా.. వారిని హాస్పిటల్కు తరలించారు.