Renu Desai: మమ్ముట్టి భార్య పాత్రలో రేణుదేశాయ్.. ధనుష్ 'ఓం' శేషాచలం ఎన్‌కౌంటర్ కథేనా?

Renu Desai: మమ్ముట్టి భార్య పాత్రలో రేణుదేశాయ్.. ధనుష్ 'ఓం' శేషాచలం ఎన్‌కౌంటర్ కథేనా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఓం' (OM) . హీరోయిన్లుగా సాయి పల్లవి, శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీపై  రోజురోజుకూ ఆసక్తికర ప్రచారం ఊపందుకుంటోంది. ఈ సినిమా 2015 శేషాచలం ఎర్రచందనం ఎన్‌కౌంటర్ ఘటన నుంచి స్ఫూర్తి పొందిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ అంశంపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

ఇదిలా ఉంటే, ఈ మూవీలో ధనుష్ సాధారణ వ్యక్తిలా కనిపిస్తూనే కథను మలుపుతిప్పే స్పై తరహా పాత్రలో కనిపించనున్నారనే టాక్ అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. అంతే కాదు ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్, ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో నటిస్తున్నారని సినీ వర్గాల సమాచారం. ఆయన భార్య పాత్రలో రేణు దేశాయ్ కనిపించనున్నారనే వార్త ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కథలో భావోద్వేగాలకు కేంద్రబిందువుగా నిలిచే కీలక పాత్రను ఆమె పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 

 

అలాగే నసీరుద్దీన్ షా విదేశాల్లో ఉన్న వ్యాపారవేత్తగా, ఇంద్రన్స్ ధనుష్‌కు అత్యంత సన్నిహితుడిగా కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. శేషాచలం ఎర్రచందనం ఎన్‌కౌంటర్ లో చాలా మంది ఈ ప్రాంతం వాసులే ఉన్నట్లు సమాచారం. ఇటీవల మమ్ముట్టితో కలిసి ఫొటోలను కూడా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ALSO READ :  ఓటీటీలోకి మరో మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్‌తోనే టెన్షన్ పెంచిన ‘వదంతి 2’..

'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ప్రస్తుతం గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మమ్ముట్టి సరసన ఆమె నటిస్తే అది కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఈ చిత్రంలో ఓ మహిళా పోలీస్ అధికారిణి పాత్ర కూడా ఎంతో బలంగా ఉంటుందనే ప్రచారం జరుగుతుండటంతో, ఆ పాత్ర ఎవరు పోషిస్తున్నారనే ఆసక్తి కూడా నెలకొంది. అయితే ఈ ప్రచారాలన్నింటిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టీజర్ లేదా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత ‘ఓం' అసలు కథపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.