అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనుముల మండలంలోని వీర్లగడ్డ తండాకు చెందిన దేపావత్ ​జబ్బార్ నాయక్, లక్ష్మి దంపతుల మూడో కొడుకు లక్ష్మణ్(25) ఐటీఐతో పాటు డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి జబ్బార్ నాయక్ పక్షవాతం వచ్చి కదలలేని స్థితిలో ఉండటంతో లక్ష్మణ్ సొంత భూమి ఎకరంతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు వేశాడు. 

పంట పెట్టుబడికి దాదాపు రూ. 5 లక్షల వరకు అప్పుల అయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మణ్ చేసిన అప్పులు తీర్చే మార్గం లేక నవంబర్​ 30న రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు లక్ష్మణ్ ను నల్గొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నిమ్స్​కు తీసుకెళ్లారు. కాగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున లక్ష్మణ్​ మృతి చెందాడు.