
- అశ్రు నయనాల నడుమ అంబర్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు
- హాజరైన జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు
ముషీరాబాద్/ పద్మారావునగర్, వెలుగు: ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య జరిగాయి. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమెకు తుది వీడ్కోలు పలికారు. హైదరాబాద్ చిక్కడపల్లి జవహర్ నగర్లోని శీలమ్స్ రెసిడెన్సిలోని నివాసంలో శుక్రవారం స్వేచ్ఛ బలన్మరణానికి పాల్పడ్డారు.
శుక్రవారం రాత్రి సుమారు 11.30 గంటలకు ఆమె మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. చిక్కడపల్లి పోలీసుల నుంచి పంచనామా పత్రాలు అందిన తర్వాత శనివారం మధ్యాహ్నం పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి, డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అందజేశారు.
ముషీరాబాద్ లోని వైఎస్సార్పార్క్ సమీపంలో తల్లిదండ్రుల ఇంటి వద్దకు భౌతిక కాయాన్ని తీసుకెళ్లారు. అక్కడ పలువురు నివాళులర్పించిన తర్వాత అంతిమయాత్ర చేపట్టారు. దారిపొడవునా ప్రజాసంఘాల నేతలు స్వేచ్ఛను తలుచుకుంటూ విప్లవ గేయాలు పాడారు. అంబర్ నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వేచ్ఛ తల్లిదండ్రులు, కూతురు, బంధువులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, వేముల వీరేశం, కాలేరు వెంకటేశ్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి, తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ శోభారాణి, సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, గోవర్ధన్, ప్రదీప్, విమలక్క, గోరటి వెంకన్న, పీవోడబ్ల్యూ సంధ్య, మాజీ ఎడిటర్లు అల్లం నారాయణ, కే శ్రీనివాస్, వేణుగోపాల్, సజయ, విరాహత్ అలీ, సోమయ్య, ఖాదర్, తదితరులు నివాళి అర్పించారు. కాగా, స్వేచ్ఛ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని పీవోడబ్ల్యూ సంధ్య డిమాండ్ చేశారు.
స్వేచ్ఛ అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరమని పేర్కొన్నారు. ఆమె మృతికి కారకుడైన పూర్ణచందర్ తన వెనుక ఉన్న వారి అండతో డబ్బులు సంపాదించి.. మహిళలను వేధింపులకు గురి చేస్తూ వాడుకుంటున్నాడని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
గాయాలు లేవు: మార్చురీ డాక్టర్
స్వేచ్ఛ మృతదేహంపై గాయాలు లేవని, ఉరేసుకున్న గుర్తులు ఉన్నాయని గాంధీ వైద్యుడు వెంకటనాగరాజు స్పష్టం చేశారు. దీన్ని ఆత్మహత్యగానే తాము భావిస్తున్నామని తెలిపారు. గుండె, కడుపు, ఊపిరితిత్తులు, పేగులు తదితర శరీరభాగాలు (విస్రా) సేకరించి, ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపినట్లు తెలిపారు.
పూర్ణచందరే కారణం: స్వేచ్ఛ తండ్రి శంకర్
తమ కూతురు స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్ అనే వ్యక్తే కారణమని మృతురాలి తండ్రి శంకర్ ఆరోపించారు. గాంధీ మార్చురీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్ణచందర్మూడేండ్లనుంచి తన కూతురు వెంట పడ్డాడని, అతడి వేధింపుల వల్లే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ‘‘నా కూతురు పెండ్లికి అంగీకరించినా కూడా ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవ జరిగింది.
ఇటీవల గొడవలు తీవ్రంకాగా పూర్ణచందర్తో కలిసి ఉండను అని స్వేచ్ఛ తేల్చి చెప్పింది. ఈ నెల 26న ఇద్దరికీ గొడవ జరిగితే నన్ను ఇంటికి రమ్మని పిలిచింది. అప్పుడు నేను వెళ్లి మాట్లాడిన. పూర్ణచందర్తో నేను రిలేషన్ లో ఉండలేను అని చెప్పింది. పూర్ణచందర్ వేధింపుల వల్ల నా కూతురు తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నది” అని తండ్రి శంకర్ తీవ్ర ఆవేదన చెందారు.
స్వేచ్ఛది ఆత్మహత్య కాదని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతోపాటు మానసిక వేధింపులతో పూర్ణచందర్ చేసిన హత్యగా భావించి, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నా తప్పేం లేదు: పూర్ణచందర్ స్వేచ్ఛతో తనకు గొడవలు లేవని పూర్ణచందర్ తెలిపారు. ‘‘తప్పంతా ఆమె తండ్రిదే. ఆయన మాటలకు కలత చెందింది. మీడియా ముందు స్వేచ్ఛ అమ్మానాన్న, బంధువులు చేస్తున్న ఆరోపణలు అబద్ధం” అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.