హైదరాబాద్ బాలానగర్లో ఘోరం.. ఈ వీడియో చూస్తే ఉలిక్కిపడటం ఖాయం

హైదరాబాద్ బాలానగర్లో ఘోరం.. ఈ వీడియో చూస్తే ఉలిక్కిపడటం ఖాయం

హైదరాబాద్: హైదరాబాద్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేకువ జామున 3 గంటల సమయంలో అతి వేగంతో ఉషా ఫ్యాన్ కంపెనీ ముందు ఉన్న స్తంభాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో.. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని ముస్తాక్(19) అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు.

స్తంభాన్ని కారు ఢీ కొట్టిన వెంటనే ఆ వేగానికి కారులో నుంచి ఒక వ్యక్తి రోడ్డు మీదకొచ్చి పడ్డాడు. దీంతో.. అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారులో ఉన్న ఇద్దరికీ మాత్రం బాగా దెబ్బలు తగిలాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం సేవించి కారు నడిపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో కారులో ఎక్కడ నుంచి వస్తున్నారు..? నలుగురూ కలిసి ఎక్కడికి వెళుతున్నారు..? ఈ ప్రశ్నలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసర ఆన్ టీ వద్ద కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్, బైక్ ఢీ కొన్న ఘటనలో బైక్ డ్రైవ్ చేస్తున్న యువకుడు మృతి చెందగా, వెనుక కూర్చున్న మరొకరికి గాయాలయ్యాయి. చనిపోయిన యువకుడిని కల్యాణ్ అని, గాయాలు అయిన తరుణ్.. బీబీ నగర్ మండలం జియాపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు మృత దేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. చికిత్స నిమిత్తం తరుణ్ను హైదరాబాద్ సిటీలోని హాస్పిటల్కు తరలించారు.