
- తనను విడిచి ఉంటోందనే కోపంతో..అన్నపూర్ణ స్టూడియోలో ఘటన
- మహిళకు గాయాలు, ఫర్నిచర్ దగ్ధం
జూబ్లీహిల్స్, వెలుగు: తనకు దూరంగా ఉంటోందన్న కోపంతో భార్యపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నాటకకు చెందిన నివ్యా వెల్వవితిన్ నిశాంత్(31), మమెల్సన్ రాజన్ 2021లో పెండ్లి చేసుకొని, కొన్నాళ్లు సికింద్రాబాద్లో నివాసం ఉన్నారు. 2022లో వీరికి ఒక బాబు పుట్టి అనారోగ్య కారణంగా కొన్ని రోజులకే చనిపోయాడు.
ఆ తరువాత మద్యానికి బానిసైన మెల్సన్ రాజన్ నిత్యం భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె ఏప్రిల్లో అల్వాల్ పోలీస్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. మధురానగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ అన్నపూర్ణ ఫిల్మ్ అకాడమీలో అడ్మిషన్ కౌన్సిలర్ గా పనిచేస్తోంది.
బుధవారం అన్నపూర్ణ స్టూడియోలోకి మెల్సన్ రాజన్ అనుమతి లేకుండా వచ్చాడు. తన భార్య పనిచేస్తున్న క్యాబిన్ వద్దకు వెళ్లి అతని వెంట తీసుకువచ్చిన పెట్రోల్ను ఆమెపై పోసి నిప్పంటించాడు. కేకలు వేయడంతో పక్కనుండే వారు వచ్చి కాపాడారు. ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. ఆఫీస్ ఫర్నిచర్, ల్యాప్టాప్ ఇతర సామగ్రి కాలిపోయాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.