ప్రేమించిన అమ్మాయి తన మీద ఫిర్యాదు చేసిందని.. పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాబాజిగూడకు చెందిన రాజ్ కుమార్, ఖుదావన్ పూర్ కు చెందిన యువతి మధ్య గత ఏడాదిగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు మరో యువతితో నిశ్చితార్థం జరిపించారు. దీంతో తనను ప్రేమించి మోసం చేశాడని యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదు మేరకు రాజ్ కుమార్ తో పాటుగా అతని కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి స్టేషన్ కు పిలిపించారు పోలీసులు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన రాజ్ కుమార్ పోలీసు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగాడు. వెంటనే పోలీసులు యువకుడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ మిషనరీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.