
మాదాపూర్, వెలుగు: అదనపు వరకట్నం కోసం అత్తింటి వారు వేధించడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈస్ట్మారేడ్పల్లిలోని అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన సుష్మ(27) వివాహనం ఇదే ఏడాది జనవరిలో నెరేడ్ మెట్కు చెందిన గొల్లూరు అమృత్తో జరిగింది. వీరిద్దరు వేర్వేరు కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు.
పెండ్లి సమయంలో కట్నంగా ఆరు తులాల బంగారం, బుల్లెట్ బండి, రూ.5.5 లక్షలు ఇచ్చారు. కొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు వేధిస్తున్నారు. ఇటీవల సుష్మకు ఆరోగ్యం బాగలేకపోవడంతో అడ్డగుట్టలోని తల్లిగారింటికి వెళ్లింది.
బుధవారం సాయంత్రం అఫీస్కు వెళ్లింది. రాత్రి 8. 30 గంటలకు ఆఫీస్ నుంచి మాదాపూర్ పీఎస్ పరిధిలోని కేబుల్ బ్రిడ్జి మీదకు చేరుకొని దుర్గం చెరువులోకి దూకింది. కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గురువారం తెల్లవారుజామున దుర్గం చెరువులో మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి అంజయ్య ఫిర్యాదుతో సుష్మ భర్త అమృత్, అత్తామామలు ఆనంద్ పాలిన, మరిది జ్యోతిరాజ్పై కేసు నమోదు చేశారు.