వీడిన మిస్టరీ.. కూతురిని చంపిన తల్లి

వీడిన మిస్టరీ.. కూతురిని చంపిన తల్లి

ఎల్​బీనగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో యువతి మృతి మిస్టరీ వీడింది. యువతి తన బావను కాకుండా ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పగా తల్లినే ఉరేసి హత్య చేసినట్టు తేలింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు బుధవారం మీడియాకు వివరాలు తెలిపారు. దండుమైలారం గ్రామానికి చెందిన జంగమ్మ కూతురు భార్గవి(23) దిల్ సుఖ్ నగర్ లోని ఓ డిగ్రీ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆమెను తన బావకు ఇచ్చి పెళ్లి చేయాలని తల్లి నిర్ణయించుకుని చెప్పింది. కానీ.. సొంతూరికి చెందిన యువకుడు శశిని ప్రేమించానని, అతడినే పెళ్లి చేసుకుంటానని తల్లితో భార్గవి చెప్పగా ఒప్పుకోలేదు. 

దీంతో ఇంట్లో తరుచూ గొడవ జరుగుతుంది. సోమవారం జంగమ్మ పొలం వద్దకు వెళ్లింది. ఆమె ఇంట్లో భార్గవి, ప్రియుడు శశి ఉన్నప్పుడు తల్లి వచ్చింది. దీంతో అక్కడి నుంచి యువకుడు వెళ్లిపోయాడు. కోపోద్రిక్తురాలై కూతురిపై జంగమ్మ విచక్షణ రహితంగా దాడి చేసింది. అంతటితో ఆగకుండా భార్గవి మెడకు చున్నీ చుట్టి కిటికీకి బిగ్గరగా అదిమిపెట్టి చంపివేసింది. 

భార్గవి తమ్ముడు చరణ్ వచ్చి తన తల్లి అక్కని ఏదో చేస్తుందని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. గడియ పెట్టి ఉండగా వీలు కాలేదు. స్థానికులు రావడంతో కూతురే ఉరేసుకుని చనిపోయిందని జంగమ్మ నమ్మించేందుకు ప్రయత్నించింది. తన తల్లినే అక్కను చంపిందని చరణ్ పోలీసులకు ఫిర్యాదు  చేయగా కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు.