హైదరాబాద్, వెలుగు: నవమాసాలు మోసి కన్నబిడ్డను మద్యం కోసం అమ్మకానికి పెట్టింది ఓ కనికరంలేని తల్లి. ఈ సంఘటన మంగళవారం హైదరాబాద్ పరిధిలో జరిగింది. వివరాలు- హబీబ్ నగర్ కు చెందిన ఓ మహిళకు రెండు నెలల క్రితం బాబు పుట్టాడు. అయితే మద్యానికి అలవాటైన ఆమె.. డబ్బుల కోసం చివరకు తన బిడ్డను అమ్మాలనుకుంది. మద్యవర్తి ద్వారా రూ.45 వేలకు బేరం కుదుర్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నారు. హబీబ్ నగర్ లో రెండు నెలల బాబును అమ్మేందుకు యత్నించిన తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన గోషామహల్ ఏసీపీ నరేందర్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు.
మంగళవారం హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో మద్యం మత్తులో ఓ మహిళ 45 వేలకు ఓ మధ్యవర్తి ద్వారా తన బాబుని విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మద్యం మత్తులో తన కు జన్మించిన బాలుడిని మధ్యవర్తికి రూ. 45 వేలకు బేరం కుదుర్చుకుందన్నారు. విషయం తెలియగానే మధ్యవర్తిని, ఆ మహిళను అరెస్టు చేసి, వారిద్దరిని హబిబ్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరిపామన్నారు. అబ్దుల్ మజీద్ మహిళ బర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్నారు.
‘స్థానిక సుబాన్పురాకు చెందిన అబ్దుల్ జోయాఖాన్, అబ్దుల్ ముజాహిద్ భార్యాభర్తలు. వీరికి షేక్ అద్నాన్ (2 నెలలు) కుమారుడు ఉన్నాడు. భర్త ఎర్రమంజిల్ కాలనీలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో ముజాహిద్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. దంపతులిద్దరూ మద్యం తాగి తరచు గొడవ పడేవారు. భార్యతో గొడవపడ్డ భర్త ఈ నెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లి, 8వ తేదీన తిరిగి వచ్చాడు. ఇంట్లో తన రెండు నెలల కుమారుడు అద్నాన్ కనిపించలేదు. దీంతో అనుమానం కలిగిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హబిభ్ నగర్ పోలీసులు కాలాపత్తర్కు చెందిన సిరాజ్ అనే మహిళకు .45 వేలకు బాలుడిని విక్రయించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు’. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. బాలుడిని ధర్మాసనం ద్వారా తల్లికి అప్పగించామని తెలిపారు ఏసీపీ నరేందర్ రెడ్డి.