ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు: ఎల్నినో ప్రభావంతో రానున్న రెండు, మూడు నెలల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని ఖమ్మం కలెక్టర్ దివాకర తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తక్కువ నీటి అవసరమయ్యే పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించారు.
రెండు, మూడు రోజుల వర్షాలను చూసి అధిక నీటి అవసరమయ్యే పంటలు సాగు చేయవద్దని, భవిష్యత్తులో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలమట్టాలు 6.5 నుంచి 8 అడుగుల మేర తగ్గాయని తెలిపారు. రానున్న నెలన్నరలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం పొద్దుతిరుగుడు, పప్పుధాన్యాలు, కంది, పెసర తదితర ఆరుతడి పంటల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, పప్పుధాన్యాల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. సత్తుపల్లి ప్రాంత రైతులు వరి సాగును తగ్గించాలని సూచించారు. జిల్లాలో సుమారు 80 వేల మంది రైతులను ఫామ్ పాండ్ల నిర్మాణానికి గుర్తించగా, ఇప్పటివరకు 3 వేల మంది అంగీకరించారని తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఓటర్లకు మరో అవకాశం..
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఖమ్మం జిల్లాలో 12,43,781 మంది ఓటర్లకు గాను 10,85,927 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. 43,131 మంది మ్యాపింగ్ కాలేదని, వారికి నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. నోటీసులు అందుకున్న వారు ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల ధృవపత్రాల్లో తగిన వాటిని సమర్పించాలని సూచించారు.
జిల్లాలో 1,32,736 అనామలీస్ గుర్తించామని, క్షేత్రస్థాయి విచారణ అనంతరం అవసరమైన సవరణలు చేపడతామని తెలిపారు. జిల్లాలో 1,57,854 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ఫారాలు తిరిగి ఇవ్వలేదని, ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లకు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు మరో అవకాశం ఉంటుందని చెప్పారు. అవసరమైన డిక్లరేషన్, ధృవపత్రాలతో తమ వివరాలను సమర్పించవచ్చన్నారు.
కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే అర్హులు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. అంతకుముందు ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్లో మధిరలో మినీ టీ-వర్క్స్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అన్ని అంశాలను పరిశీలించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. అనంతరం ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ సందర్శించి, పనులను పరిశీలించారు.
