13 ఏండ్ల పిల్లాడిని చంపి సూసైడ్ చేసుకున్న దొంగ

13 ఏండ్ల పిల్లాడిని చంపి సూసైడ్ చేసుకున్న దొంగ
  •     షాపులో కేబుల్ వైర్లు చోరీ చేసిన నాగరాజు
  •     ఇది చూసి ఓనర్​కు చెప్పిన శేఖర్
  •     షాపు యజమాని కంప్లైంట్
  •     శేఖర్​పై పగ పెంచుకుని రాయితో దాడి చేసి హత్య
  •     ఆ తర్వాత సెల్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకున్న దొంగ
  •     జోగిపేటలో ఘటన

సంగారెడ్డి/జోగిపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో దారుణం జరిగింది. నాగరాజు అనే దొంగ ఓ షాపులో కేబుల్ వైర్లు చోరీ చేశాడు. 13 ఏండ్ల శేఖర్ అనే పిల్లాడు ఇది చూసి ఓనర్​కు చెప్పడంతో అతను పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో శేఖర్​పై నాగరాజు పగ పెంచుకున్నాడు. చివరికి రాయితో దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత సెల్ టవర్ ఎక్కి తనూ సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. జోగిపేటకు చెందిన వడ్డెర నాగరాజు (28) కు తల్లిదండ్రులు లేరు. అనాథగా పెరిగి చిల్లర దొంగతనాలు చేస్తుండేవాడు.

ఇదే క్రమంలో రెండు రోజుల కింద జోగిపేటలోని ఓ స్క్రాప్ దుకాణం నుంచి కేబుల్ చోరీ చేశాడు. ఆ టైమ్​లో అక్కడే ఉన్న శేఖర్ (13)... చోరీ  విషయాన్ని షాపు యజమానికి చెప్పాడు. సదరు ఓనర్ నాగరాజుపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులు నాగరాజు ఇంటికెళ్లి ఆరా తీశారు. శేఖర్ సాక్ష్యం చెప్పడంతోనే పోలీసులు తన ఇంటికొచ్చారని తెలుసుకున్నాడు.

బాలుడిపై కక్ష పెంచుకున్నాడు. శనివారం రాత్రి శేఖర్​ను బయటికి తీసుకెళ్లి బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. తర్వాత బాలుడి డెడ్​బాడీని ఆందోల్ చెరువులో పడేశాడు. మరో  వ్యాపారిని డబ్బుల కోసం డిమాండ్ చేయగా.. ఇవ్వకపోవడంతో అతడిపైనా కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత శనివారం రాత్రి జోగిపేటలోని సెల్ టవర్ ఎక్కి దాక్కున్నాడు. 

రాత్రంతా టవర్​పై దాక్కున్న దొంగ

టవర్​పై దాక్కున్న నాగరాజును పోలీసులు గుర్తించారు. కిందికి దిగాలని కోరినా అతను వినిపించుకోలేదు. టవర్ ఎక్కి దించేందుకు ప్రయత్నిస్తే తమపైనే దాడి చేస్తాడేమో అని గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు. మధ్యాహ్నం 12 గంటల టైమ్​లో అతడిలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు. సెల్ టవర్​పై ఉన్న కేబుల్ వైర్​ను మెడకు చుట్టుకుని సూసైడ్ చేసుకున్నట్టు గుర్తించారు.

పోలీసుల సూచన మేరకు కొందరు యువకులు తాళ్ల సాయంతో నాగరాజు డెడ్​బాడీని కిందికి దింపారు. ఇదిలా ఉండగా.. శనివారం రాత్రి హత్యకు గురైన బాలుడు శేఖర్ డెడ్​బాడీని గజ ఈతగాళ్ల సాయంతో బయటికి తీశారు. శేఖర్​తో పాటు నాగరాజు డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం జోగిపేట గవర్నమెంట్ హాస్పిటల్​కు తరలించారు. నాగరాజుపై గతంలో దొంగతనాలు కేసులు ఉన్నట్టు జోగిపేట పోలీసులు తెలిపారు.