బీఆర్ఎస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవసరమైతే టీవీ చానల్

బీఆర్ఎస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవసరమైతే టీవీ చానల్
  • బీఆర్ఎస్​తోనే  దేశంలో మార్పు
  • పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సభలో కేసీఆర్
  • అక్టోబర్‌‌‌‌లోనే ఎన్నికలు.. మళ్లీ గెలిచేది మనమే
  • బీఆర్ఎస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవసరమైతే టీవీ చానల్

హైదరాబాద్, వెలుగు:  మార్పు కోసమే బీఆర్ఎస్ పుట్టిందని, దేశంలో రైతు రాజ్యాన్ని స్థాపిస్తామని ఆ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ చెప్పారు. దేశమంతా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. గురువారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌‌లో రాష్ట్ర ప్రతినిధుల సభ నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. ‘దేశంలో గుణాత్మక మార్పు సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలి’ అనే తీర్మానాన్ని మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంలో ఎనిమిది కీలకాంశాలపై చర్చించారు. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక భారీ నీటి ప్రాజెక్టు నిర్మించాలని పేర్కొన్నారు. కాశ్మీర్​నుంచి కన్యాకుమారి దాకా 20 వేల టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటున్నామని, ఇంకో 20 వేల టీఎంసీలను వినియోగించుకోగలిగితే 41 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని తీర్మానంలో చెప్పుకొచ్చారు. ఏనాటికైనా కుల వ్యవస్థ పోవాలని, దేశవ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బీసీ గణన చేపట్టాలన్నారు.

దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తం

ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. అక్టోబర్‌‌‌‌లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని మరోసారి స్పష్టతనిచ్చారు. సెప్టెంబర్‌‌‌‌లోనే ఎలక్షన్​ప్రాసెస్​స్టార్ట్​అవుతుందని, రానున్న నాలుగు నెలలు పార్టీకి అత్యంత కీలకమని చెప్పారు. ‘‘తెలంగాణ ఆకాంక్షలను నిజం చేస్తూ ఎదిగిన టీఆర్ఎస్.. దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు బీఆర్ఎస్‌‌గా మారింది. పార్లమెంటరీ పంథాతో ఏదైనా సాధించవచ్చని తెలంగాణ సాధనతో దేశానికి తెలియజేశాం. అదే పంథాతో అబ్​కీ బార్​ కిసాన్ సర్కార్ ​నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం” అని చెప్పారు. 

పార్టీ క్యాడర్‌‌లో అసంతృప్తి తగ్గించేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని, ప్రజలతో టచ్‌లో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ‘‘మన పార్టీ అధికారంలోకి రావడం పెద్ద టాస్క్​కాదు. గత ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు సాధించాలి. ‘దూపయినప్పుడు బావి తవ్వుతం’ అనే రాజకీయం ఈ కాలానికి సరిపోదు. అక్టోబర్‌‌లోనే ఎన్నికలు వస్తాయి. మళ్లీ గెలిచేది మనమే. ఈసారి వందకు పైగా సీట్లు గెలుస్తాం” అని చెప్పారు. బీఆర్ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి టీవీ యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్‌ను పార్టీ పరంగానే చేపడుతామన్నారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ చానల్ ​తీసుకొస్తామన్నారు.

అన్ని పంటలను కొనుగోలు చేస్తం


 అకాల వర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా రైతులను అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ చైతన్యం చేయాలని కేసీఆర్ సూచించారు. మక్కలు, జొన్నలు, అన్ని పంటలను గతేడాదిలాగే కొనుగోలు చేస్తామన్నారు. గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు సీఎంవోలో ఇవ్వాలని, ఆ స్థలాలను పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి పంపిణీ చేద్దామన్నారు. ఎమ్మెల్యేలు లేని చోట జెడ్పీ చైర్మన్​లు, ఎంపీలు, జిల్లా ఇన్​చార్జీలు బాధ్యతగా తీసుకొని మూడు, నాలుగు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఏపీ తలసరి ఆదాయం మనకన్నా లక్ష తక్కువగా ఉందని, అంతకన్నా తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలు 17 వరకు ఉన్నాయన్నారు. తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించవచ్చన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి విజన్​లేదని, రైతు ఆత్మహత్యలు అక్కడ ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇక్కడి పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటున్నదని, అదే నిజమైతే తెలంగాణ ఎందుకు దివాలా తీయడం లేదో చెప్పాలన్నారు.

ఎనిమిది తీర్మానాలు
‘‘దేశంలో గుణాత్మక మార్పు సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలి” అనే తీర్మానాన్ని మంత్రి కేటీఆర్​ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంలోనే ఎనిమిది కీలకాంశాలపై చర్చించి వేర్వేరు తీర్మానాలు చేశారు.

రాష్ట్రానికో భారీ ప్రాజెక్టు


‘దేశంలో రైతురాజ్యం స్థాపించాలి-. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక భారీ నీటి ప్రాజెక్టు నిర్మించాలి’ అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కాశ్మీర్​నుంచి కన్యాకుమారి దాకా 20 వేల టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటున్నామని, ఇంకో 20 వేల టీఎంసీలను వినియోగించుకోగలిగితే 41 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. 

దేశవ్యాప్తంగా 24 గంటల కరెంట్

దేశంలో 360 బిలియన్​టన్నుల బొగ్గు ఉందని, దీనితో 125 ఏండ్లు రోజుకు 24 గంటలూ ఏ కొరత లేకుండా కరెంట్​ఇవ్వొచ్చని తీర్మానంలో పేర్కొన్నారు. ‘‘దేశీయ బొగ్గు నిల్వలున్నా.. అధిక ధరతో విదేశీ బొగ్గును రాష్ట్రాలతో కొనిపిస్తూ కేంద్ర పాలకులు అవినీతికి పాల్పడుతున్నారు. దీనిపై ఉద్యమించాలి. తెలంగాణ మాదిరిగానే దేశవ్యాప్తంగా కరెంట్​సరఫరా చేయాలి” అని తీర్మానం చేశారు.

దేశమంతా రైతుబంధు

‘‘మా ప్రభుత్వం ప్రతి ఎకరానికి రూ.10 వేలు రైతుబంధు అందిస్తోంది. రైతు ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల బీమా ఇస్తోంది. కోటి ఎరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది. రైతులకు తంటాలు లేకుండా ఊరూరా కాంటాలు పెట్టి పండించిన పంట మొత్తం కొనుగోలు చేస్తోంది. ఇదే విధానం దేశమంతా అమలు చేయాలి” అని తీర్మానం చేశారు. 

దేశవ్యాప్తంగా దళితబంధు
 
‘‘దేశంలో ఏనాటికైనా కుల వ్యవస్థ పోవాలి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా దళితుల జీవితాల్లో చీకట్లు తొలగిపోలేదు. బీజేపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయి. దీనిని ఖండిస్తున్నం. తెలంగాణలో అందిస్తున్నట్టే దేశమంతా  దళితబంధు అమలు చేయాలి” అని తీర్మానం చేశారు.

రోడ్లు, ఇతర మౌలిక వసతులు భారీగా పెంచాలి

‘‘దేశంలో రోడ్​నెట్​వర్క్​సహా ఇతర మౌలిక వసతులు భారీగా పెంచాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా మన దేశంలోనూ రోడ్లు, రైల్వే లైన్​లు, ఇతర ట్రాన్స్​పోర్ట్ నెట్​వర్క్​, మౌలిక వసతులు భారీగా పెంచాలి” అని తీర్మానం చేశారు.

దేశంలో బీసీ గణన చేపట్టాలి

‘‘బీసీ వ్యతిరేక భావజాలం ఉన్న బీజేపీ.. అట్టడుగు వర్గాలకు న్యాయం దక్కకుండా దుర్మార్గపు ఆలోచనతో జనాభ గణన చేపట్టడం లేదు. దేశంలో బీసీ గణన చేపట్టాలని 1951లోనే సూచించినా ఇప్పటి వరకు చేపట్టలేదు. దేశంలో బీసీ గణన చేపట్టడంతో పాటు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి” అని తీర్మానం చేశారు.

దేశ ప్రజలందరూ ఏకం కావాలి

‘‘మతతత్వ శక్తులు దేశంలో ఏకత్వాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి.  ద్వేషం స్థానంలో ప్రేమ, అసహనం స్థానంలో సామరస్యం, అలజడి స్థానంలో ప్రశాంతతను ప్రతిష్టించేందుకు దేశ ప్రజలందరూ ఏకం కావాలి” అని తీర్మానం చేశారు.

దేశంలో మార్పు కోసం బీఆర్ఎస్​ ప్రణాళిక

‘‘చైనా, జపాన్, సింగపూర్ తదితర దేశాల విజయగాథలెన్నో మన కళ్లముందే ఉన్నాయి. కానీ మన పాలకులకు అది పట్టడం లేదు. దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్​ ఏర్పడింది. ఎన్నికల కోసమో.. అధికారం కోసమో కాదు. ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు సాధించే దిశగా మా పార్టీ ముందుకు సాగుతుంది” అని తీర్మానం చేశారు. నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయితీ ఎందుకు వస్తున్నది? ఎవరికి టికెట్లు ఇవ్వాలో నాకు తెలుసు. ఈ పంచాయితీ మొదలైతే ప్రజల్లోకి వేరే మెసేజ్ పోతది. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా అందరూ ప్రజల్లోనే, ప్రజలతోనే ఉండాలి. త్వరలోనే ఒక్కో ఎమ్మెల్యేను పిలిపించి వ్యక్తిగతంగా నేనే మాట్లాడుత.

అందరి చిట్టా ఉంది.. తోకలు కట్ చేస్త

ఎమ్మెల్యేలు ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. దళితబంధు ఇవ్వడానికి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అందరి చిట్టా నా దగ్గర ఉంది. ఇదే చివరి వార్నింగ్. మారకపోతే టికెట్​కట్​ చేస్తా. అవినీతికి పాల్పడేటోళ్ల తోకలు కట్ చేస్త. వాళ్లు ఇకపై పార్టీలో కూడా ఉండరు.
- సీఎం కేసీఆర్
జాతీయ ఎజెండాతో తీర్మానాలు

  •     దేశవ్యాప్తంగా దళిత బంధు, 
  • రైతు బంధు అమలు చేయాలి
  •     ప్రతి రాష్ట్రంలో భారీ నీటి ప్రాజెక్టు నిర్మించాలి
  •     దేశంలో బీసీ గణన చేపట్టాలి, కేంద్రంలో బీసీ శాఖ ఏర్పాటు చేయాలి
  •     తెలంగాణ మాదిరే దేశవ్యాప్తంగా 
  • కరెంట్​సరఫరా చేయాలి
  •     రోడ్లు, రైల్వే లైన్​లు ఇతర సౌలతులను భారీగా పెంచాలి