- మారేడ్పల్లి సీఐపై మహిళ ఫిర్యాదు
- అత్యాచారానికి పాల్పడ్డాడంటూ మహిళ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ మారేడ్పల్లి సీఐ నాగేశ్వర్రావుపై రేప్ కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు శనివారం ఆయనపై కేసు నమోదు చేశారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని బెదిరించి.. అతని భార్యను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు సీఐపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. ఓ కారు ప్రమాదం కేసులో కూడా నాగేశ్వరరావుపై ఇబ్రహీంపట్నంలో కేసు రిజిస్టరయ్యింది. దీంతో సీఐని సస్పెండ్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పరారీలో ఉన్న సీఐ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కేసులకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
నిందితుడిని పొలంలో కూలిగా పెట్టి..
2018లో నమోదైన ఓ కేసులో వనస్థలిపురం హస్తినాపురానికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న సీఐ నాగేశ్వర్రావు.. నిందితుడికి బెయిల్ వచ్చాక, ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడులోని తన పొలంలో పనికి పెట్టుకున్నాడు. అతను, తన భార్యతో కలిసి సీఐకి చెందిన పొలంలో పనులు చేస్తుండేవారు. ఈ క్రమంలో నిందితుడు ఇంట్లో లేని సమయం చూసి.. అతని భార్యను ఇబ్రహీంపట్నంలోని ఫామ్హౌస్కు బలవంతంగా తీసుకెళ్లి సీఐ అత్యాచారం చేశాడు.
గంజాయి కేసు పెడతామని బెదిరింపు
విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త నాగేశ్వర్రావుకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. పద్ధతి మార్చుకోకపోతే సీఐ భార్యకు చెప్తానని హెచ్చరించాడు. విషయం తన భార్యకు తెలుస్తుందేమోనని భయపడిన సీఐ.. బాధిత దంపతులను బతిమిలాడుకున్నాడు. మరోసారి అలా ప్రవర్తించనని చెప్పాడు. అయితే, ఒక రోజు ఓ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, కానిస్టేబుళ్లను హస్తినాపురంలోని బాధితుని ఇంటికి వచ్చారు. టాస్క్పోర్స్ ఆఫీస్కి తీసుకెళ్ళి తీవ్రంగా కొట్టారు. గంజాయి ప్యాకెట్స్ చేతిలో పెట్టి ఫొటోలు..వీడియోస్ తీశారు. నాగేశ్వర్రావుకు సంబంధించిన విషయాలు ఆయన భార్యకు చెప్తే గంజాయి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరించారు.
నేరుగా ఇంటికి వెళ్లి అఘాయిత్యం
నిందితుడు సొంత ఊరికి వెళ్లాడని తెలిసి.. ఈ నెల 6న బాధితురాలికి నాగేశ్వర్రావు మరోసారి వాట్సాప్ కాల్ చేసి..అసభ్యకరంగా మాట్లాడాడు. తన లైంగిక కోర్కెలు తీర్చాలని బెదిరించాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నేరుగా హస్తినాపురంలోని ఆమె ఇంటికి వచ్చాడు. ఆమెపై దాడి చేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త.. భార్య ఏడుపులు విని డోర్స్ పగులగొట్టి ఇంట్లోకి వచ్చాడు. నాగేశ్వర్రావుపై కర్రతో దాడి చేశాడు. దాంతో సీఐ రివాల్వర్ ను బయటకు తీశాడు. చెప్పినట్లు వినకుంటే బ్రోతల్ కేసు పెడతానని దంపతులిద్దరిని బెదిరించి ఓ వెహికిల్లో ఎక్కించి.. వనస్థలిపురం నుంచి ఇబ్రహింపట్నానికి బయలుదేరాడు. కారు వెనుక సీట్లో బాధితురాలు కూర్చోగా..ఆమె ముందు సీట్లో నాగేశ్వర్రావు కూర్చున్నాడు. బాధితురాలి భర్తను డ్రైవ్ చేయాలని గన్పెట్టాడు. మార్గంమధ్యలో ఇబ్రహింపట్నం సమీపంలోని చెరువు బ్రిడ్జి వద్ద కారు ప్రమాదానికి గురైంది. దాంతో భార్యాభర్తలు అక్కడి నుంచి తప్పించుకుని వనస్థలిపురం వచ్చారు. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హాట్టాపిక్గా సీఐ ఉదంతం
సీఐపై కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఇంటితో పాటు.. కారు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో క్లూస్ సేకరించారు. నాగేశ్వర్రావు కోసం గాలిస్తున్నారు. బంజారాహిల్స్ పబ్ కేసుతో పాటు.. ఎన్నో కీలక కేసులను ఛేదించిన నాగేశ్వర్రావు ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది.
‘‘నాపైన ఉన్న కేసుతో నన్ను బెదిరించి అతని పొలం దగ్గర పనికిపెట్టుకున్నాడు. జీతం నా భార్య అకౌంట్లో వేస్తా అన్నాడు. కొన్ని సార్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే.. నా భార్యను ఇంటి నుంచి తీసుకెళ్లాడు. నా భార్య వేరొకరి ఫోన్తో నాకు కాల్ చేసింది. నేను హెచ్చరించాను. గతేడాది మార్చిలో నన్ను నా భార్యను టాస్క్ఫోర్స్ ఆఫీస్కి తీసుకెళ్లారు. నాపై గంజాయి కేసు, నా భార్యను బ్రోతల్ కేసులో అరెస్ట్ చేస్తానని బెదిరించాడు. మాతో పేపర్స్ రాయించుకున్నాడు. బుధవారం మా ఇంటికి వచ్చి నా భార్యపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి వరకు మోకాళ్లపై కూర్చోబెట్టాడు. తెల్లవారుజామున 2.30 గంటల తరువాత మమ్మల్ని ఇబ్రహింపట్నం రూట్లో తీసుకెళ్ళాడు. మా కారు ఇబ్రహింపట్నం సమీపంలో పల్టీలు కొట్టింది. నేను నా భార్య అక్కడి నుంచి పారిపోయాం. కూరగాయలు తీసుకొచ్చే బస్సు ఎక్కి వచ్చాము. నాగేశ్వర్రావు సెల్ఫోన్స్ చెరువులో పడేశాం.’’
- బాధితురాలి భర్త, హస్తినాపురం