జాగ్రత్త : కంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసం..

జాగ్రత్త : కంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసం..
  •    స్పందించిన స్థానిక పోలీసులు 
  •     అక్కడి ఎంబసీ అధికారులతో చర్చలు  
  •     జోక్యం చేసుకున్న భారత ఎంబసీ ఆఫీసర్లు  
  •     తమ దగ్గరే సురక్షితంగా ఉన్నాడని స్పష్టీకరణ  

మహబూబాబాద్​అర్బన్, వెలుగు : ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి మహబూబాబాద్​జిల్లాకు చెందిన ఓ యువకుడిని కంబోడియాకు తీసుకువెళ్లి హింసించారు. దీంతో అతడు తన అన్నకు ఏడుస్తూ ఓ వీడియో పంపించాడు. ఇది కాస్తా వైరల్​ కావడంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ మన ఎంబసీ ఆఫీసర్లతో మాట్లాడగా వారు స్పందించి అతడిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాధితుడి కథనం ప్రకారం...మానుకోట జిల్లా బయ్యారం మండలం కొత్తపేటకు చెందిన మున్సిఫ్​ ప్రకాశ్​కు తల్లిదండ్రులు లేరు. దీంతో సోదరుడి సాయంతో బీటెక్ ​వరకూ చదివాడు.

విదేశాల్లో ఉద్యోగం కోసం మూడు నెలల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఏజెన్సీని సంప్రదించాడు. వారు ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నమ్మించారు. ఆస్ట్రేలియాకు అని చెప్పి బ్యాంకాక్‌కు..అక్కడి నుంచి కంబోడియా తీసుకువెళ్లారు. చెప్పిన పని ఒకటి.. చేయాల్సిన పని మరొకటి కావడంతో ప్రకాశ్​ఒప్పుకోలేదు. దీంతో మూడు రోజులకు ఒకపూట తిండి పెట్టి..ఇంజక్షన్లు ఇచ్చి బెల్టుతో చావబాదారు. షాక్ ​ఇస్తూ నరకయాతన పెట్టారు. రెండు రోజుల క్రితం పోలీసులు సదరు మోసగాళ్ల డెన్​పై దాడి చేసి ప్రకాశ్‌ను సైతం అరెస్ట్​ చేశారు.

దీంతో తనను ఎలాగైనా కాపాడమంటూ ప్రకాశ్ ​ఓ వీడియో పంపించాడు. అందులో ‘విదేశాల్లో జాబ్ ​అంటే వచ్చిన. ఇట్లయితదనుకోలే...నాకు నా మీద నమ్మకం పోయిందన్నా..ఇక్కడ ఏమైతదో అర్థం కావట్లే..నా ప్రాణం పోతదని అనిపిస్తంది. నేను సచ్చిపోతే చెల్లెకు చెప్పకు అన్నా’ అంటూ ఏడుస్తూ మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ ​మీడియాలో వైరల్ ​కావడంతో పోలీసులు స్పందించారు. ఎస్​పీ సుధీర్​ఆర్​ కేకన్​, డీఎస్పీ తిరుపతయ్య ఆదేశాల మేరకు బయ్యారం సీఐ రవికుమార్ ​కంబోడియా ఎంబసీ అధికారులతో మాట్లాడారు.

వారు అతడు క్షేమంగా ఉన్నాడని చెప్పడంతో ఆ సమాచారాన్ని కుటుంబసభ్యులకు చేరవేశారు. ఇండియన్ ఎంబసీ లో పనిచేస్తున్న ఆందోజన్ అనే ఆఫీసర్​తో మాట్లాడగా అతడు ప్రకాష్ తో టచ్​లోకి వెళ్లాడు. తర్వాత ప్రకాశ్​ను భారత దౌత్య కార్యాలయానికి తరలించారు. అతడిపై పెట్టిన కేసుల విషయం తేలిన తర్వాత ఇండియాకు పంపిస్తామని చెప్పారు.