మనిషి ఏఐతో ప్రతిసృష్టి చేస్తున్నా కూడా కులం అడ్డుగోడలు మాత్రం తొలగటం లేదు. ప్రేమించుకుంటున్న సమయంలో అడ్డురాని కులం.. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఎంతటి దారుణానికైనా పురిగొలుపుతోంది. పెళ్లి చేసుకుంటానని యువతిని గర్భవతిని చేసి.. తీరా పెళ్లి చేసుకొమ్మని అడిగే సరికి తక్కువ కులం అని మోసం చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ లోని చల్మెడలో ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న బాగోతం రాకేశ్ (24).. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి దళిత యువతిని పలుమార్లు లైంగికంగా వాడుకున్నాడు. గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని రాకేశ్ ను నిలదీసింది బాధితురాలు.
కొడుకు ప్రేమించిన యువతి దళితురాలనే కారణంగా రాకేవ్ తల్లి పద్మ పెళ్లికి నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. బాధితురాలి ఫిర్యాదుతో విచారణ జరిపిన కరీంనగర్ రూరల్ పోలీసులు తల్లి, కొడుకులను అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్.
