హైదరాబాద్, వెలుగు: ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించే గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు ఆధార్ అథెంటిఫికేషన్ తప్పనిసరి చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఈ మేరకు లబ్ధిదారులకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. పథకంలో భాగంగా లబ్ధిదారులు తమ ఆధార్ నంబర్ను కలిగి ఉన్నట్లు రుజువు సమర్పించాలని వెల్లడించింది. ఆధార్ లేని, ఇంకా నమోదు చేసుకోని అర్హులైన లబ్ధిదారులకు డిపార్ట్మెంట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సౌకర్యం కల్పిస్తుందని పేర్కొంది.
ఆధార్ బయోమెట్రిక్స్ ఫింగర్ ప్రింట్స్ రాని లబ్ధిదారులు ఐరిస్ స్కాన్, ఫేస్ అథెంటిఫికేషన్ వంటి ప్రత్యామ్నాయ విధానాల ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఫింగర్ ప్రింట్, ఐరిస్ రానీ వారు డిపార్ట్మెంట్ ఫిజికల్ ఆధార్ లెటర్ల ఆధారంగా లబ్ధి చేకూరుస్తుంది. క్యూఆర్ కోడ్ల ద్వారా, మైబైల్ ఓటీపీ ద్వారా ధృవీకరిస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఆధార్ లేని వారు ఆధార్ ధ్రువీకరణ కోసం బ్యాంక్, పోస్టాఫీసు పాస్బుక్, పాన్ కార్డు, పాస్ పోర్ట్, రేషన్ కార్డు, ఓటరు కార్డు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, పత్రాలతో ఆధార్ నమోదు చేయించుకోవాలని పేర్కొంది. డిస్కంలు లబ్ధిదారులకు ఆధార్ అథెంటిఫికేషన్పై అవగాహన కల్పించేందుకు మీడియాలో ప్రచారం కల్పించాలని నోటిఫికేషన్లో పేర్కొంది.