
చేవెళ్ల, వెలుగు: లంచం తీసుకుంటూ కానిస్టేబుల్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్లో జరిగింది. మండల పరిధిలోని కుతుబుద్దీన్ గ్రామానికి చెందిన రహీం ఓ మైనర్ ట్రాప్ కేసులో నిందితుడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసినప్పుడు పల్సర్ బైక్ ను సీజ్ చేశారు. జైలు నుంచి వచ్చిన రహీం వారం కిందట కోర్టు ద్వారా బైక్ రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. అయితే కానిస్టేబుల్ అంజిలయ్య బైక్ ఇవ్వకుండా పీఎస్ చుట్టూ తిప్పించుకుంటున్నాడు. చివరకు పది వేలు లంచం ఇవ్వాలని కానిస్టేబుల్ డిమాండ్ చేయగా రహీం ఏసీబీ అధికారులకు కంప్లయింట్ చేశాడు. శుక్రవారం రాత్రి సమయం 7:30 గంటలకు రహీం నుంచి అంజిలయ్య రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.