ఇరాన్ యుద్ధం వేళ ఇన్వెస్టర్లు డబ్బును ఎక్కడ పెడితే సేఫ్.. ఏఏ రంగాలు లాభపడతాయ్..?

ఇరాన్ యుద్ధం వేళ ఇన్వెస్టర్లు డబ్బును ఎక్కడ పెడితే సేఫ్.. ఏఏ రంగాలు లాభపడతాయ్..?

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. గ్లోబల్ మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ వారం ఆరంభంలో సెన్సెక్స్ 1,122 పాయింట్లు, నిఫ్టీ 385 పాయింట్లు పతనమవ్వడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది. అయితే మార్చి 5, గురువారం నాడు మార్కెట్లు తిరిగి కోలుకోవడం స్వల్ప ఊరటను కలిగించింది. ఇలాంటి యుద్ధ సమయంలో ఇన్వెస్టర్లు భయపడి చేతులెత్తేయాలా? లేక తెలివిగా పెట్టుబడులు పెట్టాలా? మార్కెట్ నిపుణులు ఏమని సూచిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

భయం తాత్కాలికం:
చరిత్రను గమనిస్తే.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లను తాత్కాలికంగానే దెబ్బతీస్తాయి. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు నిఫ్టీ 5 శాతం పడిపోయినా, ఏడాది ముగిసేసరికి లాభాల్లోకి వచ్చింది. మార్కెట్లు యుద్ధ వార్తలకు వేగంగా స్పందిస్తాయి.. కానీ అంతే వేగంగా కోలుకుంటాయని మహీంద్రా మ్యాన్యులైఫ్ సీఐఓ కృష్ణ సంఘ్వీ పేర్కొన్నారు. కాబట్టి ఈ సమయంలో పానిక్ అవ్వకుండా సరైన రంగాలను ఎంచుకోవడం ఇన్వెస్టర్లు చేయాల్సిన అతి ముఖ్యమైన పని.

లాభపడే రంగాలు ఇవే:
యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 85 డాలర్లకు చేరాయి. ఇది కొన్ని రంగాలకు శాపమైనా.. మరికొన్నింటికి వరంలా మారుతుంది. క్రూడ్ ధరలు పెరిగితే ఆయిల్ ఉత్పత్తి చేసే కంపెనీల లాభాలు పెరుగుతాయి. ఎనర్జీ థీమాటిక్ ఫండ్స్ గత ఏడాదిలో 27 శాతం లాభాలను అందించాయి. సరఫరా అడ్డంకులు ఉన్నంత కాలం ఈ రంగం జోరుగా లాభపడుతూనే ఉంటుంది. ఇక ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించేది బంగారాన్ని మాత్రమే. ఈ సమయంలో గోల్డ్ ఈటీఎఫ్ లు మంచి రక్షణ కల్పిస్తాయి.

ఇక చివరిగా యుద్ధం అనగానే జోరుతో లాభాల్లోకి వెళ్లేవి డిఫెన్స్ స్టాక్స్ అని ఇన్వెస్టర్లు అస్సలు మర్చిపోకూడదు. భారత ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ. 7.85 లక్షల కోట్లు కేటాయించింది. యుద్ధ వాతావరణం వల్ల రక్షణ రంగ కంపెనీలకు ఆర్డర్లు పెరిగే అవకాశం ఉంది, ఇది దీర్ఘకాలికంగా లాభదాయకం. మార్కెట్ అస్థిరతల్లో ఫార్మా & టెలికాం రంగాలు స్థిరంగా ఉంటాయి. రోగాలొచ్చినా, యుద్ధం జరిగినా మందుల వాడకం, ఫోన్ వాడకం తగ్గదు కాబట్టి ఈ షేర్లు 'డిఫెన్సివ్'గా పనిచేస్తాయి ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలో.

ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
ప్రస్తుత తరుణంలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా.. 'బిజినెస్ సైకిల్ ఫండ్స్' లేదా 'ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్' ద్వారా పెట్టుబడులను డైవర్సిఫై చేయటం ఉత్తమం. యుద్ధం ముగిసిన తర్వాత మార్కెట్లు వేగంగా పుంజుకుంటాయి కాబట్టి.. క్వాలిటీ షేర్లను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇది ఒక అవకాశంగా భావించాలి. ఇన్వెస్టర్లకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ కంటే ఓపిక, మానసిక స్థిరత్వం ఈ సమయంలో చాలా ముఖ్యం. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిన వారే భవిష్యత్తులో మంచి లాభాలను అందుకుంటారని మర్చిపోవద్దు. ఇదే అసలైన సీక్రెట్ ఇన్వెస్టర్మెంట్ ప్రపంచంలో సక్సెస్ కోసం.