కోరుట్ల,వెలుగు: గల్ఫ్లో యుద్దం పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారు జంబిగద్దె ఏరియాలో జవహార్ నవోదయ విద్యాలయం బిల్డింగ్ నిర్మించేందుకు ప్రతిపాదిత స్థలాన్ని ఎంపీ పరిశీలించారు. స్థలానికి సంబంధించిన మ్యాపును పరిశీలించారు. కోరుట్ల పట్టణ శివారులో సర్వే నంబర్ 923లో 23 ఎకరాల్లో అన్ని వసతులతో నవోదయ గురుకులాన్ని నిర్మించనున్నట్లు ఎంపీ వివరించారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. యుద్దం జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ ఆఫీస్లో హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గల్ఫ్ కార్మికులు, ఎన్ఆర్ఐల ఎంబసీ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే కాల్సెంటర్కు కాల్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం అయ్యప్పగుట్ట వద్ద తాత్కాలికంగా నిర్వహిస్తున్న జవహార్ నవోదయ గురుకులంలో ఏర్పాటు చేసిన సైన్స్ఫెయిర్ను తిలకించారు. ప్రథమ వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొని స్టూడెంట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో జీవాకర్రెడ్డి, డీఈవో రాము, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి, తహసీల్ధార్ కృష్ణచైతన్య, ప్రిన్సిపాల్ బ్రహ్మనందరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
