- ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, వెలుగు: ఆర్టీసీ పేద ప్రజల గుండెచప్పుడు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో స్థానిక బస్ స్టేషన్లో సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్ సర్వీసులను గురువారం సాయంత్రం ప్రారంభించారు. మొదటి దశలో కరీంనగర్ -వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్- చింతకుంట, కరీంనగర్- కొత్తపల్లి హవేలీ రూట్లలో సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సిటీ బస్సుల డిమాండ్ను నెరవేర్చామని తెలిపారు.
భవిష్యత్లో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు కూడా సిటీ బస్సు సేవలను విస్తరిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీరామ్ చక్రవర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.
