హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ దాచ జనార్దన్ మహేశ్కు చెందిన రూ.5.15 కోట్ల విలువైన 19 ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు దర్యాప్తు చేపట్టింది. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించిన డబ్బుతో కుటుంబసభ్యుల పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టారని పేర్కొంది. తన బంధువు కేబీ.లక్ష్మీనారాయణకు చెందిన మహాలక్ష్మి కన్స్ట్రక్షన్స్ కంపెనీతో కలిసి శ్రీ ఇందిరా సదన్ ప్రాజెక్టు పేరుతో మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. కోర్టు ఆదేశాలతో అక్రమ ఆస్తులను జప్తు చేసినట్లు ప్రకటించింది.
