సదాశివపేట, వెలుగు : ఆస్తి పన్ను తగ్గించేందుకు లంచం తీసుకుంటూ సదాశివపేట మున్సిపల్ బిల్ కలెక్టర్ ఏసీబీ ఆఫీసర్లకు చిక్కాడు. ఏసీబీ డీఏస్పీ సుదర్శన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... సదాశివపేట పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి గతంలో రూ. 41 వేల ఇంటి పన్ను వస్తుండగా.. ఇటీవల రూ. 1.04 లక్షలు వచ్చింది. ఈ విషయంపై సదరు వ్యక్తి మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇంటికి మరోసారి మెజర్మెంట్ వేయాలని కమిషనర్ ఆఫీసర్లకు సూచించాడు.
ఈ క్రమంలో ఇంటి ట్యాక్స్ను సుమారు రు. 35 వేలకు తగ్గిస్తానని.. ఇందుకు తనకు రూ. 35 వేలు ఇవ్వాలని బిల్ కలెక్టర్ నిఖిల్రెడ్డి ఇంటి యజమానిని అడిగాడు. దీంతో మొదటి విడతగా రూ. 20 వేలు ఇచ్చిన ఇంటి ఓనర్ తర్వాత ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో గురువారం బిల్ కలెక్టర్ నిఖిల్రెడ్డిని కలిసి మిగతా రూ. 15 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు బిల్ కలెక్టర్ నిఖిల్రెడ్డిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు చేసి, ఈ వ్యవహారంలో ఇతర ఆఫీసర్ల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పోడు భూమి జోలికి రాకుండా ఉండేందుకు రూ. 10 వేలు...
గుండాల, వెలుగు : పోడు చేసుకుంటున్న భూమి జోలికి రాకుండా ఉండేందుకు లంచం తీసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి జిల్లా గుండాల మండలం నడిమిగూడెం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నరేశ్ సాయనపల్లి ఇన్చార్జి బీట్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాడు.
సాయనపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పోడు చేసుకుంటుండగా.. ఆ భూమి జోలికి రాకుండా ఉండాలంటే రూ. 15 వేలు ఇవ్వాలని లేదంటే భూమిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించాడు. సదరు రైతు తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో.. రూ. 10 వేలకు ఒప్పందం కుదిరింది. తర్వాత సదరు రైతు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో గురువారం బీట్ ఆఫీసర్ నరేశ్ రైతు నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

