
ఇబ్రహీంపట్నం, వెలుగు: రెవెన్యూ అధికారుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతున్నది. లంచం కోసం పీడించడంతో బాధితులు ఏసీబీని ఆక్రయిస్తున్నారు. ఫలితంగా బుధవారం ఒక్కరోజే ఇబ్రహీంపట్నం, ముషీరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రెండ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్ పరిధిలోని ఆదిబట్ల రెవెన్యూ గ్రామానికి చెందిన బాధితుడు తన తండ్రి పేరిట ఉన్న సర్వే నంబర్355లోని 7 గుంటల భూమి విషయంలో రెవెన్యూ సమస్యలు (నిషేధిత జాబితా) ఎదుర్కొంటున్నాడు.
ఈ విషయంలో మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఆఫీస్లోని ఆర్ఐ కృష్ణను సంప్రదించగా, ఆర్డీఓ, తహసీల్దార్, డీటీకు ఇవ్వాలంటూ రూ.12 లక్షల లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు రూ.9 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నప్పటికీ, ఆ తర్వాత లంచం ఇవ్వడం ఇష్టం లేక పక్కా ఆధారాలతో ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో కృష్ణను ఏసీబీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకొని, అతని వద్ద ఉన్న ఫైళ్లను తనిఖీ చేశారు. నిందితుడి ఉన్నతాధికారులైన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత రెడ్డి, తహసీల్దార్ సునీత, డీటీ శ్రీనివాస్నుసైతం దాదాపు 3 గంటలకు పైగా విచారించారు. అనంతరం ఆర్ఐ కృష్ణను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇతర ఉన్నతాధికారుల పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ముషీరాబాద్: ముషీరాబాద్ పరిధిలోని సీతాఫల్ మండికి చెందిన రామకృష్ణ బ్యాంకులో తనఖా పెట్టిన బంగారం విడిపించడానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నాడు. సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరుతూ ముషీరాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలోని ప్రత్యేక ఆర్ఐ భూపాల మహేశ్ను కలిశాడు. అతను రూ.1.10 లక్షలు డిమాండ్చేయగా, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం రూ.25 వేల లంచం తీసుకుంటుండగా, మహేశ్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మహేశ్ కార్యాలయంతో పాటు కొంపల్లిలోని అతని నివాసంలో తనిఖీలు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించినట్లు సిటీ రేంజ్ ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.