
మంచిర్యాల జిల్లాలో అవినీతి సర్వేయర్ ఏసీబీ వలకు చిక్కారు. ల్యాండ్ సర్వే కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు మంచిర్యాల మండల సర్వేయర్ మంజుల. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పక్కా సమాచారంతో బుధవారం ( జూన్ 4 ) మంచిర్యాల తహలాసిల్దార్ కార్యాలయంపై దాడి జరిపారు ఏసీబీ అధికారులు. బాధితుడి నుండి రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసిన సర్వేయర్.. డబ్బును తన అసిస్టెంట్ కు పంపమని కోరినట్లు తెలిపాడు బాధితుడు.
ఈ క్రమంలో సర్వేయర్ అసిస్టెంట్, చైన్ మెన్ ఉదయ్ కి మొదటి విడతగా 16,500 ఫోన్ పే, నెట్ క్యాష్ 10000 రూపాయలు పంపించాడు బాధితుడు.ల్యాండ్ రీ సర్వే చేసేందుకు మరో 30000 వేల రూపాయలు ఇవ్వాలని సర్వేయర్ మంజుల డిమాండ్ చేసినట్లు తెలిపాడు బాధితుడు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు.
బాధితుడు పిర్యాదు మేరకు మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంపై దాడి చేసిన అధికారులు మండల సర్వేయర్ మంజుల, చైన్ మెన్ ఉదయ్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. కాసుల కోసం కక్కుర్తి పడి.. సామాన్యులను పీడిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీకి సమాచారం ఇవ్వాలని కోరారు అధికారులు.