
- 28 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న ఆఫీసర్లు
హైదరాబాద్సిటీ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 33 ఆర్టీవో(రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్) కార్యాలయాలు, సరిహద్దుల్లోని ఆర్టీఏ(రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ)చెక్పోస్టులపై ఏసీబీ(యాంటీ కరప్షన్ బ్యూరో) అధికారులు గురువారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఉప్పల్, తిరుమలగిరి, కామారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్ పాటు మరో 19 ఆర్టీఏ ఆఫీసులు, చెక్పోస్టులపై అధికారులు దాడులు చేసి సుమారు రూ.1,81,030 నగదును స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జూన్ లో కూడా ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పలు ఆర్టీఏ కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ ఏడాది మరోసారి ఆర్టీఏ కార్యాలయాలపై దాడులు చేపట్టారు.
హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా డిఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా తిరుమలగిరిలో 10 మంది ఏజెంట్లను, ఉప్పల్లో మరో 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచిసెల్ ఫోన్లు, ఇతరత్రా సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నించినట్టుగా తెలిసింది.ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనాల లైసెన్సుల జారీతోపాటు తదితర విషయాల్లో అధికారులు, రవాణా ఉద్యోగులు కమీషన్లు తీసుకుంటూ అక్రమ దందాలకు పాల్పడుతున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం.
సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ తనిఖీలు
ఖమ్మం జిల్లా బూర్గంపాడు, వరంగల్లోని భీమదేవరపల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.91,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు లేదా సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తే వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అధికారులు సూచించారు. అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.