- డీజిల్ వినియోగంపై అవినీతి ఆరోపణలు
- అనధికారిక నగదు రూ. 41 వేలు స్వాధీనం
- ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడి
జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ ఆదేశాలతో డీఎస్పీ విజయ్ కుమార్ టీమ్ సోమవారం తనిఖీలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ కు చెందిన రూ. 41, 117 అనధికారిక నగదును స్వాధీనం చేసుకుంది. తలుపులు మూసివేసి ఒక్కొక్క ఉద్యోగిని విచారిస్తూ.. దాదాపు ఆరు గంటల పాటు కొనసాగించారు. అనంతరం మీడియా సమావేశంలో ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు.
వాటికి సంబంధించిన వివరాలు కానీ బిల్లులు కానీ సంబంధిత ఉద్యోగులు వివరణ ఇవ్వలేదన్నారు. మున్సిపల్ ఆఫీసులో అవినీతి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులతో ఉన్నతాధికారుల ఆదేశాలతో సోదాలు చేసినట్టు తెలిపారు. మున్సిపల్ రికార్డులు సరిగా లేవని, ఉద్యోగుల అటెండెన్స్ వివరాలు పూర్తిగా నమోదు చేయకుండా వదిలిపెట్టారని చెప్పారు. ఇన్ వార్డు రిజిస్టర్, బయట ఫిర్యాదుల రిజిస్టర్ వివరాలు సరిగా లేవని, కోర్టు కేసుల్లో మున్సిపల్ నుంచి ఎవరు అటెండ్ అవుతున్నారనే విషయాలను కూడా తెలియజేయలేదని పేర్కొన్నారు.
మ్యుటేషన్ వివరాలు సరిగా నమోదు చేయలేదని, బిల్డింగ్ పర్మిషన్లు సరిగా లేవని వివరించారు. అనధికారికంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో రూ. 41, 117 దొరికాయని, వాటికి సంబంధించిన బిల్లులు వివరాలు ఇవ్వలేదన్నారు. జేసీబీ లెవలింగ్ బ్లేడు కు నిత్యం రూ. 5000 బిల్లును డ్రా చేస్తున్నారని, వాటి వివరాలు సైతం చూపలేదన్నారు. మున్సిపాలిటీలోని ఇతర వెహికల్స్ వినియోగానికి సంబంధించిన బిల్లులు అధికారికంగా లేవనన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సదానందం వద్ద ఫోన్ పే లో కొన్ని డబ్బులు ఉన్నాయని, వాటికి సమాధానం సరిగా లేకపోవడంతో ఫోన్ సీజ్ చేశామన్నారు. పూర్తి రికార్డులను స్వాధీనం చేసుకొని వారం రోజుల్లో నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. సోదాల్లో ముగ్గురు సీఐలతో పాటు తొమ్మిది మంది సిబ్బంది పాల్గొన్నారు.
