మిర్యాలగూడ మున్సిపల్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. శుక్రవారం ( మే 8 ) నిర్వహించిన ఈ సోదాల్లో భారీగా అవకతవకలు బయటపడ్డాయి.ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... రూ. 24.86 కోట్ల పన్ను అంచనాకు గానూ వసూలైంది కేవలం రూ. 9.17 కోట్లు మాత్రమేనని గుర్తించారు అధికారులు.1783 షాపుల పన్నులో అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు అధికారులు. పన్నుల విషయంలో 54 ఫిర్యాదులు వచ్చినా అధికారులు స్పందించలేదని.. టౌన్ ప్లానింగ్ విభాగం నోటీసులకే పరిమితమైందని తెలిపారు అధికారులు.
పోర్టల్లో ఎంట్రీ లేకపోవడంతో 1,820 పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని.. వందలాది జనన-మరణ ధృవపత్రాల జారీలో తీవ్ర జాప్యం జరిగినట్లు గుర్తించారు. బిల్డింగ్ పర్మిషన్లు,మ్యూటేషన్ దరఖాస్తుల్లో లెక్కలకు,రికార్డులకు పొంతన లేదని తెలిపారు అధికారులు.
4వేల 638 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని.. సుమారు రూ. 15 కోట్ల ఆదాయం నిలిచిపోయినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు.అంతే కాకుండా.. క్యాష్ రిజిస్టర్, వాహనాల లాగ్ బుక్స్ నిర్వహణలో కూడా లోపాలు గుర్తించామని తెలిపారు అధికారులు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో కూడా అవకతవకలు గుర్తించినట్లు తెలిపారు అధికారులు. అవకతవకలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు ఏసీబీ అధికారులు.
