
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో సోదాలు చేసి.. నలుగురు డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.96,870 సీజ్ చేశారు. ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్లకు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేపట్టామని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లు ఆఫీస్ లోకి రావొద్దని, కానీ సబ్ రిజిస్ట్రార్ ఆదేశాలతో వస్తున్నట్లు తేలిందని చెప్పారు. ఆఫీస్ లో 2023--–24 సంవత్సరానికి సంబంధించిన డాక్యుమెంట్లు జిల్లా ఆఫీస్ కు రిటర్న్ చేయలేదని పేర్కొన్నారు.
ఏ డాక్యుమెంట్ రైటర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో.. వాళ్ల పేర్లు కూడా దానిపై రాస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని, అవినీతికి పాల్పడుతున్న ఆఫీసర్లపై ప్రభుత్వానికి రిపోర్టు అందిస్తామని వివరించారు. పూర్తి దర్యాప్తు అనంతరం సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. తనిఖీల్లో ఏసీబీ ఇన్ స్పెక్టర్లు ఎస్.రాజు, ఎల్.రాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.