
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. గురువారం ( ఆగస్టు 21 ) ఆర్మూర్ ఆర్టీఏ ఆఫీసులో నిర్వహించిన ఈ దాడుల్లో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గుర్రం వివేకానంద రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. నిజామాబాద్ ఏజెంట్ నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఎంవీఐ వివేకానంద రెడ్డి.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆర్టీఏ ఆఫీసుపై దాడి చేసి ఎంవీఐ వివేకానంద రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇదిలా ఉండగా.. అవినీతి అధికారులను కట్టడి చేయడంలో ఇటీవల దూకుడు పెంచారు ఏసీబీ అధికారులు.
బుధవారం ( ఆగస్టు 20 ) సూర్యాపేట జిల్లా కోదాడలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అటవీశాఖ ఉద్యోగి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ దాడులకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కోదాడలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా పని చేస్తున్న వెంకన్న చెట్ల వ్యాపారి నుంచి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా వెంకన్నను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంకన్నను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు అధికారులు.