హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నుంచి ఏసీబీ అధికారులు కీలక వివరాలు రాబట్టారు. బినామీ పేర్లతో ఉన్న ఆస్తులను చిట్టా సేకరించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న బినామీ ఆస్తులతోపాటు గురువారం మరో నాలుగు అనుమానాస్పద ఆస్తులను గుర్తించారు. కోర్టు అనుమతితో శివబాలకృష్ణను 8 రోజుల కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు కస్టడీలో వ్యక్తిగత వివరాలు, ఆస్తులు, ఆదాయం, ఇతర సమాచారం సేకరించారు.
రెండో రోజైన గురువారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్లోని హెడ్ క్వార్టర్స్కి తరలించారు. శివబాలకృష్ణ పేరుతో 8 బ్యాంక్ అకౌంట్లు, భార్య రమాదేవి పేరుతో 4, కుటుంబ సభ్యులైన పద్మావతి పేరుతో 2, శివహరిప్రసాద్ పేరుతో ఒక బ్యాంక్ అకౌంట్ఉన్నట్లు గుర్తించారు. ఆయా అకౌంట్ల స్టేట్మెంట్లను సేకరించారు. అలాగే శివహరిప్రసాద్ పేరిట నాలుగు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని ఓపెన్ చేసేందుకు బ్యాంక్ అధికారుల అనుమతి తీసుకున్నారు. భార్య, కొడుకు, సోదరుడు, బంధువుల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను సేకరించారు. శుక్రవారం బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నట్లు సమాచారం.