ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే చర్చ వాడీవేడీగా జరిగింది. మానవ, భౌతిక వనరుల దుర్వినియోగం రాష్ట్రం దుస్థితిని మరింత తీవ్రతరం చేసిందని గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై.. టీడీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్.. ఏపీలో అవినీతి భారీ స్థాయిలో జరిగిందని అన్నారు. నీరు-చెట్టు ప్రాజెక్టులో, ధర్మపోరాట దీక్ష పేరుతో, పోలవరం నిర్మాణంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయన్నారు. అందుకే ఆ పార్టీ నుంచి కేవలం 23 మందే గెలిచారని అన్నారు. వీరందరినీ ‘ఆలీ బాబు.. 23 దొంగలు’ అని సంబోధించారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా వారిద్దరి మధ్య ఘాటు సంభాషణ జరిగింది. పరోక్షంగా వారిద్దరి మధ్య నారా లోకేశ్ ప్రస్తావన వచ్చింది. ఏమీ తెలియని అనిల్ చంద్రబాబు నాయుడుకు ఇరిగేషన్ పాఠాలు చెపుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. దానికి బదులుగా అనిల్ కుమార్.. తనకు తెలియకుంటే తెలుసుకుంటానని, మంగళగిరిని మందలగిరి అని కూడా పలకడం రాని పప్పును కాదని అన్నారు. ఎన్నికల్లో గెలవని వ్యక్తిని మంత్రిని చేశారంటూ ధ్వజమెత్తారు అనిల్ కుమార్.