బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. బాత్‌రూమ్‌లో శవమై తేలిన యువనటుడు

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. బాత్‌రూమ్‌లో శవమై తేలిన యువనటుడు

బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. నటుడు, మోడల్ ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సోమవారం (మే 22న) ముంబయి అంధేరీలోని తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. కదలిలు లేకుండా పడివున్న ఆదిత్యసింగ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆదిత్య సింగ్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

పోస్టుమార్టం నివేదిక వస్తే అతని మరణానికి కారణం తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆదిత్యసింగ్‌ డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ కావడం వల్ల మరణించాడా.. లేదంటే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఢిల్లీకి చెందిన ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత నటుడిగా బాలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రాంతివీర్, మైనే గాంధీ కో నహిన్ మారా వంటి చిత్రాలలో నటించాడు. అతను దాదాపు 300లకు పైగా అడ్వర్‌టైజ్‌మెంట్స్‌లో కనిపించాడు. స్ప్లిట్స్‌ విల్లా- 9 వంటి రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. లవ్, ఆషికి, కోడ్ రెడ్, ఆవాజ్ సీజన్ 9, బ్యాడ్ బాయ్ సీజన్ -4తో పాటు ఇతర టీవీ షోల్లో కనిపించాడు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆదిత్య సింగ్‌ ఐదు రోజుల క్రితం కూడా ఒక పోస్ట్‌ చేశాడు. ఆ పోస్టుకు హ్యాప్పినెస్‌ గురించి మీరు ఏమనుకుంటున్నారు..? అంటూ ఇంగ్లిష్‌లో క్యాప్షన్‌ ఇచ్చాడు. అమ్మ చేతి ముద్ద, అలసిపోయి రాగానే దొరికే ప్రేమ, నచ్చిన స్నేహితుడితో గడిపే సమయం, పెంచుకున్న కుక్కతో ఆటలో హ్యాప్పినెస్‌ ఉంటుందని, ఇప్పుడు డబ్బు కూడా ఈ జాబితాలో చేరిందని పేర్కొన్నాడు. డబ్బు ముఖ్యమేగానీ డబ్బులోనే హ్యాప్పీనెస్‌ ఉండదని రాస్తూ.. నాతో మీరు ఏకభవిస్తున్నారా.. అని ప్రశ్నించాడు. ఇంతలోనే ఆదిత్య సింగ్ మృతిచెందడంపై అతని ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.