Rajendra Prasad: నోరుజారాను.. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయను.. ఎంజీఆర్ అభిమానులకు రాజేంద్రప్రసాద్ క్షమాపణ

Rajendra Prasad: నోరుజారాను.. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయను.. ఎంజీఆర్ అభిమానులకు రాజేంద్రప్రసాద్ క్షమాపణ

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో దివంగత నటుడు, తమిళనాడు మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, సీనియర్ నటుడు నాజర్ సోషల్ మీడియా వేదికగా రాజేంద్ర ప్రసాద్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే నటుడు రాజేంద్రప్రసాద్‌ క్షమాపణలు చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ.. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్ గురించి తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటున దొర్లాయని విచారం వ్యక్తం చేశారు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని స్పష్టం చేస్తూ, తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు.

“తమిళ ప్రేక్షకుల మాదిరిగానే నేనూ ఎంజీఆర్‌ను దైవంలా భావిస్తాను. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో నోరుజారింది. అవి ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు కావు. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయను” అని రాజేంద్ర ప్రసాద్ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే?

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన 'కత్తి కాంతారావు మెమోరియల్ నేషనల్ అవార్డ్' వేడుకలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. దివంగత నటుడు కాంతారావు గొప్పతనాన్ని కొనియాడారు. తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అయితే, వారి మధ్య 'తిలకం' వంటి వారు కాంతారావు అని ప్రశంసించారు.

అయితే, ఇదే క్రమంలో ఆయన ఎంజీఆర్ ప్రస్తావన తీసుకొస్తూ.. కాంతారావు ని చూస్తే ఎంజీఆర్ భయపడేవారని, ఆయన పేరు వింటేనే వణికిపోయేవారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన ఈ మాటలే ఇప్పుడు తమిళ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి.

విశాల్ సీరియస్:

రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై విశాల్  తీవ్రంగా స్పందించారు. ఒక లెజెండరీ నటుడిని పొగిడే క్రమంలో మరో మహానుభావుడైన ఎంజీ రామచంద్రన్ ను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని అన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.