రాజకీయాల్లోకి నటుడు సప్తగిరి.. పోటీ చేసేది అక్కడి నుంచే

రాజకీయాల్లోకి నటుడు సప్తగిరి.. పోటీ చేసేది అక్కడి నుంచే

రాజకీయాల్లోకి మరో నటుడు ఎంట్రీ ఇస్తున్నాడు. కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన సప్తగిరి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సప్తగిరి.. ఈ ప్రకటన చేసి అందర్నీ షాక్ కు గురి చేశారు. 

తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం అని.. త్వరలో ఆ పార్టీలో చేరబోతున్నట్లు చెప్పటమే కాకుండా.. 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు కూడా స్పష్టం చేశారు సప్తగిరి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పార్లమెంట్ లేదా అసెంబ్లీకి పోటీ చేస్తున్నానని.. తుది నిర్ణయం లోకేష్ దే అని వివరించారాయన. తన సొంతూరు చిత్తూరు అని.. ఐరాల ఆస్పత్రిలోనే పుట్టానని.. అందుకే చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే టికెట్ విషయంలో లోకేష్ హామీ ఇచ్చారని.. ఏ నియోజకవర్గం అనేది త్వరలోనే తెలుస్తుందన్నారు సప్తగిరి. 

పేదలకు సేవ చేయటానికే రాజకీయాల్లోకి వస్తున్నానని.. టీడీపీ అధికారంలోకి రావటానికి నా సేవలు అవసరం అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయటానికి సిద్ధంగా ఉన్నానని కూడా తెలిపారు ఈ నటుడు. చంద్రబాబు, లోకేష్ ఏం చెబితే అది చేయటానికి రెడీగా ఉన్నానని.. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అన్నారు సప్తగిరి.