'దొంగలున్నారు జాగ్రత్త' ఎక్సయిటింగ్ గా ఉంటుంది

'దొంగలున్నారు జాగ్రత్త' ఎక్సయిటింగ్ గా ఉంటుంది

డి.సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి, గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు. ప్రీతి అస్రాని కథానాయిక. సర్వైవల్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో హీరో శ్రీ సింహ మీడియా సమావేశంలో ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.

'దొంగలున్నారు జాగ్రత్త' సినిమా చేయడానికి మీకు ఆసక్తిని కలిగించిన అంశం ?
కథ చాలా గ్రిప్పింగా అనిపించింది. చాలా కొత్త జోనర్. ఎక్కడా సాగదీత లేకుండా బలమైన సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథని రాసుకున్నారు దర్శకుడు సతీష్. సురేష్ ప్రొడక్షన్స్‌, గురు ఫిలింస్‌ బ్యానర్స్ ఉండటం కూడా ఆసక్తిని కలిగించింది.

మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
ఇందులో దొంగగా కనిపిస్తా, ఈ కథలోనే ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. ఒక దొంగగా వచ్చిన వ్యక్తి చివరికి ఎలా మారాడు, తన తప్పులను ఎలా తెలుసుకున్నాడనేది కూడా సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. అయితే మంచి దొంగలా చూపించడం మాత్రం ఇందులో ఉండదు. చాలా సహజంగా దొంగని దొంగనే చూపించాం. దొంగని చూస్తే చిరాకు వస్తుంది. అదే సమయంలో అతను తప్పు తెలుసుకున్నపుడు జాలి కూడా కలుగుతుంది.

ఒకే లొకేషన్ లో పని చేయడం ఎలా అనిపించింది ?
కథ చాలా ఎకయిటింగ్ ఉంటడంతో ఒకే లొకేషన్ అనే ఫీలింగ్ రాలేదు. కథ చాలా అద్భుతంగా రావడంతో షూటింగ్ లో కూడా చాలా ఎక్సయిట్ మెంట్ ఉండేది. ప్రేక్షకులు సినిమా చూస్తున్నపుడు కూడా ఈ ఎక్సయిట్ మెంట్ ఫీలౌతారు. ఈ సినిమా కోసం వర్క్ షాప్ కూడా చేశాం. ఒక గంట కార్లో ఉండిపొతే ఎలా ఉంటుంది ? ఒక పూట కార్లో ఇరుక్కుపొతే ఎలా ఉంటుందని రకరకాలుగా రిహార్సల్ చేసి ఒక వర్క్ షాప్ చేశాం. ఈ సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. ప్రతి సీన్ ఇంట్రస్టింగా నడుస్తుంటుంది. బలమైన కంటెంట్ ఉండటం వలన నటుడిగా నాకు పెద్ద కష్టం అనిపించలేదు.

కేవలం కార్లో షూటింగ్ చేయడం ఒక సవాల్ కదా ?
నాకంటే కెమరా డిపార్ట్ మెంట్ కే ఎక్కువ ఛాలెంజ్. ఒక రూమ్ లో షూట్ చేసినపుడే కెమరా యాంగిల్స్ కి ఎక్కువ స్పేష్ ఉండదు. అలాంటిది ఒక కార్ అంటే ఇంకా సవాల్ తో కూడుకున్నది. అయితే కెమెరామెన్ యశ్వంత్ బ్రిలియంట్ గా చేశారు. ఎక్కడా బోర్ కొట్టినట్టు అనిపించదు. అలాగే కార్ ని ఏ పార్ట్ కి ఆ పార్ట్ తీసి పెట్టె విధంగా డిజైన్ చేశాం. ఇది కొంత హెల్ప్ అయ్యింది.

తెలుగులో తొలిసారి సర్వైవల్ థ్రిల్లర్‌ తీశారు కదా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నారు ?  
సర్వైవల్ థ్రిల్లర్‌ హాలీవుడ్ లో విరివిగా వస్తుంటాయి. బాలీవుడ్ లో కూడా వచ్చాయి. ఈ జోనర్ లో తెలుగులో తొలిసారి థియేటర్ ఎక్స్ పిరియన్స్ ఇవ్వబోతున్నాం. ఈ జోనర్ ని ఎవరు ఒకరు మొదలుపెట్టాలి. మేము స్టార్ట్ చేయడం చాలా ఎక్సయిటింగ్ ఉంది. ఆడియన్స్ కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది.

దర్శకుడు సతీష్ త్రిపుర గురించి ?
సతీష్ త్రిపుర రామానాయుడు ఫిలిం ఇన్‌స్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్స్ చేశారు. సురేష్ ప్రొడక్షన్ లో కొన్ని చిత్రాలకు అసోషియేట్ గా పని చేశారు. ఆయన చాలా క్లియర్ విజన్ తో ఈ కథని రాసుకున్నారు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా స్క్రీన్ మీదకి రప్పించగలిగారు.

మొదటి సినిమా థ్రిల్లర్, ఇప్పుడు మరో థ్రిల్లర్.. ఎక్కువ థ్రిల్లర్స్ చేయాలని నిర్ణయించుకున్నారా ?
ఒకే జోనర్ లో సినిమాలు చేయాలని అనుకోను. ప్రతి జోనర్ చేస్తాను. అయితే కథ విన్నపుడు నేను ముందు ఎంటర్ టైన్ అవ్వాలి, నాకు గ్రిప్పింగా అనిపించాలి. బావుందని అనుకుంటే ఎలాంటి పరిమితులు పెట్టుకొను.

కథల ఎంపిక విషయంలో ఫ్యామిలీ సలహాలు తీసుకుంటారా ?
సలహాలు తీసుకుంటాను. కానీ తుది నిర్ణయం మాత్రం నాదే. 'దొంగలున్నారు జాగ్రత్త' విషయానికి వస్తే సలహా కూడా తీసుకోలేదు. బావుందనిపించింది. ఓకే చేశాను. కొన్నిసార్లు కొన్ని సందేహాలు ఉంటాయి. భైరవ, కార్తికేయ, బాబాయ్, నాన్న, అమ్మ అందరినీ సలహా అడుగుతాను. కొన్ని  సలహాలు ఇస్తారు. అయితే ఫైనల్ గా నిర్ణయం నా చేతుల్లోనే ఉంటుంది.

కాల భైరవ సంగీతం గురించి ?
భైరవ అన్న మ్యూజిక్ చేస్తున్నారంటే నాకు గట్టినమ్మకం. నేపధ్య సంగీతం మాత్రం చాలా బ్రిలియంట్ గా చేశారు.

'దొంగలున్నారు జాగ్రత్త' చూసిన తర్వాత రాజమౌళి గారు ఎలా స్పందించారు ?
చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ సినిమా గురించి మొదట వారికి ఏమీ చెప్పలేదు. సినిమా పూర్తయ్యాక వారి కోసం ఒక స్పెషల్ షో వేశాం. సినిమా చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు. చిన్న చిన్న మార్పులు సూచించారు. ఆ మార్పులు చేసిన తర్వాత సినిమా ఇంకా స్ట్రాంగ్ అయ్యింది.

మీ కెరీర్ ఒక స్థాయికి వెళ్ళాలనే ఒత్తిడి ఉందా ?
నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. వచ్చిన సినిమాల్లో బెస్ట్ ఎంచుకుంటూ వెళ్తున్నాను. అందరికీ ఉన్నట్టే ఒకొక్కమెట్టు ఎదిగి పెద్ద సినిమాలకి చేరుకోవాలనే లక్ష్యం ఉంది.

మల్టీస్టారర్స్ పై మీ అభిప్రాయం ?
మల్టీస్టారర్స్ ని చాలా ఎంజాయ్ చేస్తాను. ఒకరితో కలసి పని చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. నా స్థాయిలో ఏదైనా మల్టీస్టారర్ వస్తే తప్పకుండా చేస్తా.  చిన్న సినిమాలు మల్టీస్టారర్స్ వస్తుంటాయి. పెద్ద సినిమాలు మన దగ్గర తక్కువ. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ ట్రెండ్ వస్తుందని భావిస్తున్నాను.

రాజమౌళి గారిని సినిమా చేయాలని అడుగుతుంటారా ?
లేదండీ. నా స్థాయి ఏమిటో నాకు తెలుసు. ఆయనతో సినిమా చేసే స్థాయికి ఎదగడానికి చాలా సమయం ఉంది. ఆయనతో సినిమా చేయడం ఒక కల. ఆ కల ఉంది.. కానీ అప్పుడే దాన్ని ఆశించకూడదు.

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
భాగ్ సాలే, ఉస్తాద్ సినిమాలు చేస్తున్నా. భాగ్ సాలే ఈ ఏడాది రావచ్చు. ఉస్తాద్  షూటింగ్ జరుగుతోంది.