రియాన్‌ పరాగ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ వృథా.. రాజస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం

రియాన్‌  పరాగ్‌  కెప్టెన్‌  ఇన్నింగ్స్‌  వృథా.. రాజస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం

జైపూర్‌: ఐపీఎల్‌–19లో మూడు వరుస పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ మళ్లీ గాడిలో పడింది. భారీ లక్ష్య ఛేదనలో కేఎల్‌ రాహుల్‌ (40 బాల్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75), పాథుమ్‌ నిశాంక (33 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలిచింది. టాస్‌ నెగ్గిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 225/6 స్కోరు చేసింది. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (50 బాల్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 90), డొనోవాన్‌ ఫెరీరా (14 బాల్స్‌లో 1 ఫోర్‌, 6 సిక్సర్లతో 47 నాటౌట్‌) దంచికొట్టారు. తర్వాత ఢిల్లీ 19.1 ఓవర్లలో 226/3 స్కోరు చేసి నెగ్గింది. నితీశ్‌ రాణా (33) ఫర్వాలేదనిపించాడు. తమ ఐపీఎల్‌ హిస్టరీలో ఢిల్లీకి ఇదే అతిపెద్ద ఛేజింగ్‌ కావడం విశేషం. రాహుల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

  • ఓపెనర్లు ఫెయిలైనా..

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ను ఆరంభంలోనే ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. ఇన్నింగ్స్‌ మూడో బాల్‌కే యశస్వి జైస్వాల్‌ (6)ను స్టార్క్‌ (3/40) కాటన్‌ బౌల్డ్‌ చేస్తే.. తర్వాతి ఓవర్‌లో జెమీసన్‌ (1/48) వండర్‌ కిడ్‌ వైభవ్‌ సూర్యవంశీ (4)ని పెవిలియన్‌కు పంపాడు. దాంతో 12/2తో కష్టాల్లో పడిన రాయల్స్‌ను ధ్రువ్‌ జురెల్‌ (42), పరాగ్‌ ఆదుకున్నారు. ఫోర్లతో క్రీజులో కుదురుకున్న వీరిద్దరు ఆరో ఓవర్‌ నుంచి బ్యాట్లు ఝుళిపించారు. ఈ ఓవర్‌లో పరాగ్‌ 6, 4, 6తో 20 రన్స్‌ రాబట్టడంతో పవర్‌ప్లేలో రాజస్తాన్‌ 56/2 స్కోరు చేసింది. 

తర్వాతి ఓవర్లలో జురెల్‌ బౌండ్రీలు రాబడితే.. 9వ ఓవర్‌లో పరాగ్‌ రెండు వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. నాలుగు ఓవర్లలో 35 రన్స్‌ రావడంతో ఫస్ట్‌ టెన్‌లో రాయల్స్‌ 91/2 స్కోరు చేసింది. ఇక్కడి నుంచి పరాగ్‌ విధ్వంసం మరో మెట్టు ఎక్కింది. 32 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన పరాగ్‌ 11వ ఓవర్‌లో 4, 6 దంచాడు. 12వ ఓవర్‌లో జురెల్‌ 6 కొట్టి అక్షర్‌ పటేల్‌ (1/39)కు వికెట్‌ ఇచ్చాడు. 

ఫలితంగా మూడో వికెట్‌కు 102 రన్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ ముగిసింది. పరాగ్‌తో జత కలిసిన జడేజా (20) ఆరంభంలో స్ట్రయిక్‌ రొటేట్‌ చేశాడు. 15వ ఓవర్‌లో జడేజా సిక్స్‌, పరాగ్‌ ఫోర్‌తో స్కోరు 147/3కి పెరిగింది. 16వ ఓవర్‌లో పరాగ్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో రెచ్చిపోయాడు. కానీ17వ ఓవర్‌లో స్టార్క్‌ డబుల్‌ ఝలక్‌ ఇచ్చాడు. 

మూడు బాల్స్‌ తేడాలో జురెల్‌, పరాగ్‌ను ఔట్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 53 రన్స్‌ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన ఫెరీరా సిక్సర్లతో శివమెత్తాడు. కుల్దీప్‌ వేసిన 18వ ఓవర్‌లో మూడు సిక్స్‌లతో 20 రన్స్‌ దంచాడు. తర్వాతి ఓవర్‌లో స్టార్క్‌కు 4, 6 రుచి చూపెట్టాడు. అప్పటి వరకు సింగిల్స్‌ తీసిన శుభమ్‌ దూబే (6) ఆఖరి ఓవర్‌లో వెనుదిరిగినా.. ఫెరీరా 4, 6, 6తో రాజస్తాన్‌కు భారీ స్కోరు అందించాడు. 

  • కీలక భాగస్వామ్యం..

ఛేజింగ్‌లో ఓపెనర్లు పాథుమ్‌ నిశాంక, కేఎల్ రాహుల్‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆర్చర్‌ వేసిన తొలి ఓవర్‌లోనే నిశాంక 4, 6 కొడితే, తర్వాతి ఓవర్‌లో రాహుల్‌ రెండు ఫోర్లతో బ్యాట్లు ఝుళిపించాడు. మూడో ఓవర్‌లో నిశాంక 4, 4, రాహుల్‌ 6తో 15 రన్స్‌ వచ్చాయి. తర్వాత నిశాంక 6, 6, 4తో 23 బాల్స్‌లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. పవర్‌ప్లేను 70/0తో ముగించిన ఢిల్లీకి ఈ ఇద్దరు భారీ స్కోరు అందించారు. వరుస విరామాల్లో బౌండ్రీలు బాదడంతో 8.4 ఓవర్లలోనే స్కోరు వంద దాటింది. కానీ 10వ ఓవర్‌లో నిశాంకను జడేజా (1/33) ఔట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 110 రన్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ ముగిసింది. ఈ దశలో వచ్చిన నితీష్‌ రాణా నిలకడగా ఆడాడు. 

రెండో ఎండ్‌లో రాహుల్‌ 27 బాల్స్‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. 12, 14వ ఓవర్‌లో రాహుల్‌ 6, 6, 6, నితీశ్‌ 4, 6, 4తో  రెచ్చిపోయారు. కానీ 15వ ఓవర్‌లో తుషార్‌ (1/38) దెబ్బకు నితీశ్‌ వెనుదిరగడంతో రెండో వికెట్‌కు 61 రన్స్‌ భాగస్వామ్యం ముగిసింది. స్కోరు 173/2గా మారింది. ఇక చివరి 30 బాల్స్‌లో 53 రన్స్‌ అవసరం కాగా, రాహుల్‌ ఫోర్‌ కొట్టి తర్వాతి బాల్‌కు ఇచ్చిన క్యాచ్‌ను ఫెరీరా అందుకున్నాడు. ఇక్కడి నుంచి అశుతోష్‌ శర్మ (25 నాటౌట్‌), ట్రిస్టాన్ స్టబ్స్‌ (18 నాటౌట్‌) వేగంగా సింగిల్స్‌ తీయడంతో పాటు ఫోర్లు, సిక్సర్లు బాదడంతో మరో ఐదు బాల్స్‌ మిగిలి ఉండగానే డీసీ విజయాన్ని అందుకుంది. 

సంక్షిప్త స్కోర్లు

రాజస్తాన్‌: 20 ఓవర్లలో 225/6 (రియాన్‌ పరాగ్‌ 90, ఫెరీరా 47*, స్టార్క్‌ 3/40). 

ఢిల్లీ: 19.1 ఓవర్లలో 226/3 (రాహుల్‌ 75, నిశాంక 62, జడేజా 1/33).