న్యూఢిల్లీ: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు.. లుసానే డైమండ్ లీగ్లో కఠిన పరీక్ష ఎదురుకానుంది. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ రుమేశ్ పతిరాగేతో పాటు అర్షద్ నదీమ్ (పాకిస్తాన్), కెషోర్ వాల్కట్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), సైమన్ వీల్యాండ్ (స్విట్జర్లాండ్), థామస్ రోహ్లర్ (జర్మనీ) బరిలో ఉండటంతో పోటీ తీవ్ర స్థాయిలో ఉండనుంది. గతేడాది వెన్ను నొప్పితో ఆటకు దూరమైన నీరజ్.. ఇటీవలే కామన్వెల్త్లో బరిలోకి దిగాడు. గోల్డ్ మెడల్ ఫేవరెట్గా దిగినా.. 85.83 మీటర్ల త్రోతో రజతానికి పరిమితమయ్యాడు.
ఇక జూన్లో జరిగిన దోహా డైమండ్ లీగ్లో 85.69 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. కాబట్టి ఈసారి డైమండ్ లీగ్లో ఈ పెర్ఫామెన్స్ ఏమాత్రం సరిపోదు. జాకుబ్ వాద్లెచ్ (చెక్), జూలియన్ వెబర్ (జర్మనీ), కర్టిస్ థాంప్సన్ (అమెరికా) నుంచి నీరజ్కు ముప్పు తప్పదు. కామన్వెల్త్లో 89.75 మీటర్ల త్రోతో స్వర్ణం గెలుచుకున్న రుమేశ్.. రోమ్ వేదికగా జరిగిన గోల్డెన్ గాలాలో 92.62 మీటర్ల వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఓవరాల్గా ఈ సీజన్లో 90 మీటర్ల మార్క్ను దాటిన ఏకైక త్రోయర్గా రుమేశ్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ నెల 21 నుంచి డైమండ్ లీగ్ పోటీలు జరగనున్నాయి.
