
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ కొత్త పార్టీ వార్తలు రావటం తమిళనాడులో కామన్. అందులోనూ సినిమా ఇండస్ట్రీ నుంచి వెరీ వెరీ కామన్. మొన్నటి వరకు రజినీకాంత్ విషయంలో ఇదే జరిగింది. 15 ఏళ్లుగా.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయాల్లో వస్తున్నాడు.. పార్టీ పెడుతున్నాడు.. పోటీ చేస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. చివరికి ఏమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి ప్రచారమే హీరో విజయ్ పై జరుగుతుంది. కొన్నేళ్లుగా విజయ్ ఆధ్వర్యంలో పొలిటికల్ పార్టీ వస్తుందని అందరూ అంటున్నారు.. అందుకు తగ్గట్టుగానే విజయ్ సినిమాల్లోనే కాకుండా బయటకు కూడా అతని ప్రవర్తన, డైలాగ్స్ ఉంటున్నాయి. జయలలిత మరణం తర్వాత కచ్చితంగా పార్టీ పెడతారని భావించినా అలాంటిది జరగలేదు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీస్తున్న వేళ.. హీరో విజయ్ పొలిటికల్ పార్టీ పెడుతున్నట్లు మళ్లీ తమిళనాడులో జోరుగా సాగుతున్న ప్రచారం.
జనవరి 25న చెన్నైలోని పనయార్ లో తన ఆఫీసులో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో సమావేశం నిర్వహించడమే ఇందుకు కారణం. చెన్నై, మధురై, కోవై,తిరుచ్చి వంటి పలు జిల్లాలో నుంచి దాదాపు 150 మందికి పైగా ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు. వీరితో చర్చించిన విజయ్.. రాజకీయ పార్టీపై ఫైనల్ డెసీషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ సూచనతో సభ్యులు పార్టీ దరఖాస్తు కోసం అప్లై చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
విజయ్కు తమిళనాడు, కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 2018లో తుత్తుకుడి పోలీసుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. డిసెంబర్లో వరద బాధిత జిల్లాలను సందర్శించి బాధిత ప్రజలకు ఆర్థిక సాయం, నిత్యవసర వస్తువులను అందజేశారు. పీపుల్స్ మూవ్ మెంట్ తరపున గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం రాత్రి పాఠశాలలు ప్రారంభించారు.
తమిళనాడులో రజనికాంత్ పొలిటికల్ పార్టీ పెడతానని వెనుకంజ వేశారు. కమల్ హాసన్ వచ్చారు. తర్వాత ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.