ముమైత్‌ఖాన్‌ రూ.30 వేలకు గోవా ట్రిప్‌ మాట్లాడుకుని మోసం చేసింది

ముమైత్‌ఖాన్‌ రూ.30 వేలకు గోవా ట్రిప్‌ మాట్లాడుకుని మోసం చేసింది

హైదరాబాద్: నటి ముమైత్‌ఖాన్‌‌ గురించి డ్రైవర్‌ రాజు సంచలన విషయాలు బయటపెట్టాడు. ముమైత్‌ఖాన్‌ రూ.30 వేలకు గోవా ట్రిప్‌ మాట్లాడుకుందని, మూడు రోజుల కోసం గోవా ట్రిప్‌కు కారు తీసుకెళ్లిందని తెలిపాడు. అయితే 5 రోజుల పాటు గోవాలో తిప్పిందని వాపోయాడు. డీజిల్‌ ఖర్చుకు డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని, కారులో మద్యం, సిగరెట్లు తాగుతూ అసభ్యంగా ప్రవర్తించిందని వాపోయాడు.

‘‘అలా చేయొద్దన్నందుకు నన్ను బూతులు తిట్టి బెదిరించింది. ముమైత్‌ఖాన్‌ దగ్గర పనిచేసిన డ్రైవర్లు కాల్ చేసి.. తమను కూడా ఇబ్బంది పెట్టిందని వారి బాధలు చెప్పుకుంటున్నారు. రోజు కూలీ చేసుకునే నాపట్ల ఇలా వ్యవహరిస్తుందనుకోలేదు. ఒక సెలబ్రిటీ ఇలా వ్యవహరిస్తుందని అనుకోలేదు. గోవా నుంచి వచ్చిన వెంటనే 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాను. మా డ్రైవర్ల అసోసియేషన్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. నాకు రావాల్సిన రూ.15 వేలు ఇస్తుందో లేదో తెలీదు’’ అని డ్రైవర్‌ రాజు ఆవేదన వ్యక్తం చేశాడు.

ముమైత్‌ఖాన్‌‌పై డ్రైవర్‌ రాజు చేస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను మోసం చేసిందని రాజు మంగళవారం నుంచి మీడియాతో తన బాధలను చెప్పుకున్నాడు. టోల్ గేట్‌కు, డ్రైవర్ అకామిడేషన్‌కు డబ్బులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా టోల్‌గేట్ దగ్గర కట్టిన డబ్బులు తాలూకు రిసిప్ట్స్‌, ముమైత్‌తో కలిసిన దిగిన ఫొటోలు, ఆమెతో చేసిన వాట్సాప్ చాట్‌ను రాజు షేర్ చేశాడు. ముమైత్ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇంతవరకూ ముమైత్ మాత్రం కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందిచకపోవడం గమనార్హం.