
‘మనసును కదిలించే కథ కావాలా? అయితే రెడీ అవ్వండి. వచ్చేస్తున్నా’ అంటోంది రష్మిక మందాన్న. ఆమె నటించిన బాలీవుడ్ మూవీ రిలీజ్కి రెడీ అయ్యింది మరి. నిన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. నిజానికి రష్మిక మొదట ‘మిషన్ మజ్ను’ సినిమాకి ఓకే చెప్పింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా శాంతను బాగ్చీ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ జూన్లోనే రిలీజవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇంతలో ఆమె నటించిన సెకెండ్ మూవీ ‘గుడ్ బై’ విడుదలకు సిద్ధమైంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో వికాస్ బెహల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని అక్టోబర్ 7న రిలీజ్ చేయనున్నట్టు నిన్న ప్రకటించారు. ఇదో తండ్రీ కూతుళ్ల కథ. తండ్రిగా బిగ్ బీ, కూతురిగా రష్మిక కనిపించనున్నారు. పేరెంట్స్ విషయంలో పిల్లల బాధ్యతని గుర్తు చేసే హార్ట్ వార్మింగ్ స్టోరీ అని టీమ్ చెబుతోంది. మరోవైపు సౌత్లోనూ సూపర్ స్పీడ్తో సాగిపోతోంది రష్మిక. ఆల్రెడీ చేతిలో ఉన్న ప్రాజెక్టులకి తోడు రీసెంట్గా తమిళంలో విక్రమ్ సరసన కూడా చోటు సంపాదించినట్టు తెలుస్తోంది.