వెలుగు, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ప్రోగ్రామం చేపట్టి, పలుచోట్ల ఉచిత వైద్య శిబిరాలు, సురక్షిత ప్రయాణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్ మామునూర్ 4వ బెటాలియన్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని కమాండెంట్ శివప్రసాద్రెడ్డి, ఎన్.హనీ ప్రారంభించారు. జనగామలో సరోజిని కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ పండేరి చేతన్నితిన్ప్రారంభించి, పరీక్షలు చేయించుకున్నారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని డీఎస్పీ కిశోర్ ప్రారంభించగా, 560 మంది వాహన డ్రైవర్లు, యజమానులు, ఇతరులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి సర్కిల్ పరిధిలో సీఐ రాజగోపాల్ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించి, పరీక్షలు నిర్వహించారు. ఖమ్మం సిటీలో వన్టౌన్ సీఐ కరుణాకర్ బైకర్స్కు హెల్మెట్, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. కామేపల్లి మండలం లింగాల క్రాస్రోడ్డులో ఎస్సై శ్రీకాంత్, మధిర మండలం బోనకల్ పోలీస్ స్టేషన్లో గ్రామ పాలకులు, ప్రజలకు వైరా ఏసీపీ సారంగపాణి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
