కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం నుంచి ‘గుర్తుందా గుర్తుందా’ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఇండియన్ సినిమాలో గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయి.
మా సినిమా కూడా అందులో చేరబోతోంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలోని రైటింగ్, సీన్స్కు థియేటర్లో ఎక్సయిట్ అవుతారు. ఇందులోని హీరో పాత్రకు చాలా కనెక్ట్ అయ్యాను. ‘గుర్తుందా గుర్తుందా’ పాట తరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని చెప్పాడు. తనను నమ్మి గొప్ప పాత్రను ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోయిన్ శ్రీగౌరి ప్రియ థ్యాంక్స్ చెప్పింది.
నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ ‘‘బేబి’ తర్వాత అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్లీ కావాలని మనసుకు నచ్చినట్టుగా ఈ కథ రాసుకున్నా. నేను కూడా తీయలేనంత అద్భుతంగా రవి తీశాడు. కిరణ్ అబ్బవరంకు ఈ సినిమా ఒక మెమొరబుల్ మూవీ అవుతుంది’ అని చెప్పారు. ‘కిరణ్తో చేస్తున్న రెండో సినిమా ఇది. అద్భుతమైన ట్యూన్స్ కుదిరాయి’ అని మణిశర్మ అన్నారు.
నిర్మాత ఎన్కేఎన్ మాట్లాడుతూ ‘ఒక హానెస్టీ సినిమా చేసినప్పుడే టీమ్ అందరిలో ఎక్సయిట్మెంట్ ఉంటుంది. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ మంచి ఫీల్ను ఇస్తుంది’ అని చెప్పారు. నటుడు మహేందర్, నిర్మాత ధీరజ్ మొగిలినేని, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకి, ఎడిటర్ సంతోష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
